పీఎంఈజీపీ రుణాల్లో భారీగా అక్రమాలు
ఖమ్మంవైరారోడ్: జిల్లాలో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) రుణాల్లో భారీగా అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. ఈ రుణాలతో పాటు ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లు, ఆయా పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలపై తక్షణమే విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంఈజీపీ పథకాన్ని జిల్లాలోని కొంద రు దళారులు, రాజకీయ నాయకులు, బ్యాంక్ అధికారులు కలిసి పక్కదారి పట్టించారని ఆరోపించారు. పలు ప్రాంతాల్లో 90 శాతానికి పైగా యూనిట్లు లేకుండానే రూ.10 కోట్లకు పైగా రుణ సబ్సిడీ తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ కుంభకోణంపై కలెక్టర్ విజిలెన్స్ విచారణచేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాక ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లు, ఆయాలుగా అనర్హులను నియమించినందున విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు ఉప్పల వెంకటరమణ, బెల్లం వేణుగోపాల్, పగడాల నాగరాజు, బిచ్చాల తిరుమల్రావు, పగడాల నరేందర్, లింగనబోయిన సతీశ్, యలమద్ది రవి, బలుసు మురళీకృష్ణ, మహమ్మద్ రఫీ పాల్గొన్నారు.
ఆ ఇల్లు బోసిపోయింది..
ఖమ్మంరూరల్: ఓ విద్యార్థిని మర ణం ఆమె కుటుంబాన్నే కాదు... ఆ వీధి, పాఠశాల, స్థానికులను శోకసంద్రంలో ముంచెత్తింది. 14 ఏళ్ల క్రితం ఒక కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రులు ఇంకొకరికి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ విధి చిన్నచూపు చూడడంతో ఇంకో కుమార్తె కూడా మృత్యువాత పడింది. ఇందుకు సంబంధించి వివరాలు.. ఏదులాపురం మున్సిపాలిటీ 28వ వార్డుకు చెందిన రంగిశెట్టి ఉదయ్ – స్రవంతి దంపతులకు 14 ఏళ్ల క్రితం కవల కుమార్తెలు జన్మించారు. ఇందులో ఓ కుమార్తె పసిప్రాయంలోనే పేగు సంబంధిత సమస్యతో మృతి చెందింది. అదే సమస్యతో బాధపడుతున్న ఇంకో కుమార్తె వైదికకు తల్లిదండ్రులు చికిత్స చేయిస్తూ ఇన్నాళ్లు కంటికి రెప్పలా కాపాడారు. కానీ విధి మరోసారి అదే కుటుంబాన్ని పరీక్షించింది. హైదరాబాద్లో చికిత్స చేయిస్తుండగా వైదిక పరిస్థితి విషమించి మంగళవారం కన్నుమూసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించిన తీరు స్థానికులందరినీ కంట తడి పెట్టించింది.
చివరిచూపు కోసం...
ఏదులాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైదిక ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆమె పాఠశాల స్నేహితులతోనే కాక స్థానికులతో కలివిడిగా ఉండేది. ఆమె మృతి చెందిన సమాచారం తెలియగానే స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. అంతేకాక వైదిక అంతిమయాత్ర పాఠశాల సమీపం నుంచి వెళ్తుండగా స్నేహితురాలికి వీడ్కోలు పలికారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సైతం కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.
మాజీ ఎమ్యెల్యే
సండ్ర వెంకటవీరయ్య


