రఘునాథపాలెం: గ్రామపంచాయతీ కార్మికుల శ్రమ దోపిడీకి కారణమైన జీఓ 51ను రద్దుచేసి మల్టీపర్పస్ వర్కర్స్ వ్యవస్థను తొలగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. రఘునాథపాలెంలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘం (ఏఐటీయూసీ) మూడో రాష్ట్ర మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత యూనియన్ పతాకాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసఫ్ ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు టంగుటూరి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం కేవలం రూ.8,500 చెల్లించడం సరికాదన్నారు. కనీస వేతన చట్టం ప్రకారం నెలకు రూ.16 వేల వేతనం ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు. త్వరలో అసంఘటిత రంగ కార్మికులను సమన్వయం చేసి కనీస వేతనాల కోసం రాష్ట్రవ్యాప్త పోరాటం చేపడతామని తెలి పారు. కొన్ని పెద్ద పంచాయతీల్లో కార్మికులకు ఎక్కువ వేతనాలు ఇస్తున్నా వాటిని అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షు డు ఎండీ యూసఫ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగులు, కార్మికులకు ప్రతీనెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు మాత్రం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేల గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సుమారు 54 వేల మంది కార్మికులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్, కొత్తగూడెం మేయర్ మూడు గణేశ్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు, నాయకులు బీజీ క్లెమెంట్, వెంకటరాజం, రావి శివరామకృష్ణ, తోట రామాంజనేయు లు, సీహెచ్ సీతామహాలక్ష్మి, నిమ్మటూరి రామకృష్ణ, మల్లికార్జున్, వాసిరెడ్డి మురళి, పిట్టల మల్లయ్య పాల్గొన్నారు.


