డీఏపీ కొరత
రైతులకు కన్నీరు తెప్పిస్తున్న
కాంప్లెక్స్ ఎరువుల ధర
గత ఏడాది కంటే బస్తాకు
రూ. 800 వరకు పెంపు
రేటు పెరగని డీఏపీ
దొరకడంలేదని రైతుల ఆవేదన
ఏటేటా భారంగా మారుతున్న
పంటల సాగు
డీఏపీ దొరకటం లేదు
ధరలు బాగా పెరిగాయి
బూర్గంపాడు: కాంప్లెక్స్ ఎరువుల ధరలు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఓ వైపు ఎకరాకు ఇచ్చే రెండు బస్తాల యూరియా సరిపోవటంలేదు. మరోవైపు కాంప్లెక్స్ ఎరువుల ధర అమాంతం పెంచేశారు. గతేడాది వానాకాలం సీజన్ ధరతో పోల్చితే బస్తాకు రూ. 800 వరకు పెంచారు. దీంతో పెట్టుబడి భారం పెరిగి రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతులపై ఆర్థిక భారం
ఇరాన్, అమెరికా దేశాల మధ్య కొంతకాలంగా సాగుతున్న యుద్ధ నేపథ్యంలో ఎరువుల కంపెనీలు అమాంతంగా ధరలను పెంచేశాయి. ఏడాది కాలవ్యవధిలోనే మూడుసార్లు కాంప్లెక్స్ ఎరువులు ధరలు పెరిగాయి. గతంలో బస్తాకు రూ.50 నుంచి రూ.100 వరకు మాత్రమే ధరలు పెరిగేవి. ఏడాది కాలంగా ఎరువుల బస్తా ధరలు ఒకేసారి బస్తాకు రూ.300 నుంచి రూ.500 వరకు పెరుగుతున్నాయి. గతేడాది వానాకాలం సీజన్లో రూ.1350 ఉన్న 20:20:00:13 కాంప్లెక్స్ ఎరువు బస్తా ధర ప్రస్తుతం రూ.2150 చేరింది. ఏడాది కాలంలోనే బస్తా రూ.800 పెరిగింది. 14:35:14 ఎరువు, 10:26:26 ఎరువు, 16:16:16 వంటి ఇతర కాంప్లెక్స్ ఎరువులు, ఎంఓపీ(మ్యూరేట్ ఆఫ్ పోటాష్) ధరలు కూడా అధికంగా పెరిగాయి. ఎకరాకు సగటున 4 బస్తాల కాంప్లెక్స్ ఎరువులు అవసరం అవుతుండటంతో పెరిగిన ధరలతో రైతులపై అధికభారం పడుతోంది.
ప్రస్తుతం రైతులకు డీఏపీ(డై అమ్మోనియా ఫాస్పేట్) మాత్రమే అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం భారీగా రాయితీ ఇస్తుండటంతో డీఏపీ ఎరువు ధర అధికారికంగా పెరగలేదు. కానీ ప్రస్తుతం డీఏపీ సరఫరా సక్రమంగా లేదు. డీలర్ల వద్ద అందుబాటులో లేదు. ఒకవేళ డీలర్ వద్ద ఉన్నా డీఏపీ కొనాలంటే ఇతర కాంప్లెక్స్ ఎరువులు, న్యూట్రియంట్స్, నానో డీఏపీ వంటి వాటిని అంటగడుతున్నా రు. డీఏపీ కొరతను అవకాశంగా తీసుకుని కొందరు డీలర్లు అధిక ధరలకు అమ్ముతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వరినాట్లు వేసే ముందు దుక్కిలో డీఏపీ చల్లుతారు. లేకుంటే మొదటి విడతగా రైతులు పంటలకు డీఏపీని వేసుకుంటారు. ప్రస్తుతం డీఏపీ దొరకక పోవటంతో అధిక ధరకు కాంప్లెక్స్ ఎరువులు కొనా ల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో యూ రియా మాదిరిగానే డీఏపీని కూడా ఫర్టిలైజర్ యాప్లో విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
డీఏపీ దొరకటం లేదు. మిగతా ఎరువులు ధర భారీగా పెంచారు. గతేడాది రూ.1350కు కొన్నటువంటి 20:20 బస్తా ధర ఇప్పుడు రూ. 2150కు పెంచారు. గతేడాదితో పోల్చుకుంటే ఎకరాకు రూ.3వేలకు పైగా ఖర్చు పెరుగుతుంది.
– గాదె ప్రభాకర్రెడ్డి, రైతు
ఈ ఏడాది కాంప్లెక్స్ ఎరువుల ధరలు బాగా పెంచారు. బస్తాకు రూ.700 నుంచి రూ.800 వరకు ధరలు పెరిగాయి. డీఏపీకి ధర పెంచలేదని చెబుతున్నా, అది దొరకట్లే. యూరియా లాగే డీఏపీని కూడా ఆన్లైన్ బుకింగ్తో అందిస్తే కొంత భారం తగ్గుతుంది.
– దౌపాటి శ్రీనివాసరావు, రైతు


