పాల్వంచరూరల్: ఇంటింటా తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇళ్లను శుభ్రం చేసుకుని ఉదయాన్నే తలంటు స్నానాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారు జాము నుంచే ఆలయాలకు తరలివెళ్లారు. తులసీ దళాలు, కొబ్బరికాయలు, పూలతో దైవ దర్శనం కోసం క్యూలైన్లలో బారులుదీరారు. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. గ్రామాల్లో రైతులు ప్రత్యేకంగా జరుపుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో ఆలయాలను దర్శించుకుని వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు చేశారు. మొక్కజొన్న పేలాలతో పిండిని తయారు చేసి ప్రసాదంగా స్వీకరించారు.
అమ్మవారికి అష్టోత్తర కలశాభిషేకం
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి కలశాభిషేకం, స్వామివారికి వరుణయాగ పూజలు నిర్వహించారు. శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి భక్తులు కలశాలతో ఊరేగింపుగా తరలివచ్చారు. అర్చకులు అష్టోత్తర కలశ పూజలు చేశారు. శివాలయంలో శ్రీ అన్నపూర్ణా సమేత కాశీవిశ్వేశ్వరస్వామికి ఘటాభిషేకం (వరుణయాగం) పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ విజయ్కుమార్, అర్చకుడు పద్మనాభశర్మ పాల్గొన్నారు.


