ప్రత్యామ్నాయ పంటలు, పంట కాలం, నీటి అవసరం, ప్రయోజనాలిలా..
నష్టం జరగకుండా చూడాలి..
అవగాహన కల్పిస్తున్నాం
● వరి తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు ● తక్కువ నీటితో అధిక ఆదాయం ఇచ్చే పంటల సాగుకు ప్రాధాన్యం ● రైతులకు వ్యవసాయశాఖ సూచనలు ● ఖరీఫ్ సీజన్లో పంటల సాగుపై సందిగ్ధం
చర్ల: ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఇప్పటికే జిల్లాలో వర్షాలు ఆలస్యమవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు తక్కువ నీటితో ఎక్కువ లాభాలు ఆర్జించే పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. ప్రత్యేకించి అధికనీరు అవసరమయ్యే వరిసాగు విస్తీర్ణాన్ని తగ్గించి, తక్కువ నీటితో అధిక దిగుబడులు ఇచ్చే చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలను సాగు చేయాలని సూచిస్తున్నారు. దీంతో సాగు వ్యయం తగ్గి, మంచి ఆదాయం వస్తుందని చెబుతుండగా వరిసాగు చేసే రైతాంగం సందిగ్ధంలో పడింది.
తగ్గిన వర్షపాతం
జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య జిల్లాలో సాధారణ వర్షపాతం సుమారు 1,100 మి.మీ నుంచి 1,200 మి.మీ. వరకు నమోదవుతుంది. ఎన్నినో ప్రభావంతో ఇప్పటివరకు కురవాల్సిన వర్షపాతం కురవలేదు. మిగిలిన ఆగస్టు, సెప్టెంబర్లో కూడా ఆశించిన మేర వర్షాలు కురిసే పరిస్థితులు లేవని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. కాగా, సాధారణంగా వరికి 1,200 – 1,500 మి.మీ. వరకు నీటి అవసరం ఉంటుంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో అధిక నీరు అవసరమయ్యే వరి వంటి పంటలను సాగు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రత్యామ్నాయ పంటల సాగును ఎంచుకోవా లని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
చిరుధాన్యాల వైపు మొగ్గు
జొన్న, సజ్జ, రాగులు వంటి చిరుధాన్యాలు తక్కువ నీటితో సాగవుతాయి. మార్కెట్లో డిమాండ్ పెరు గుతుండటంతో రైతులకు మంచి ధర లభించే అవకాశం ఉంది. పెసర, మినుము, కంది వంటి పప్పు ధాన్యాలకు కూడా నీటి అవసరం, సాగు ఖర్చు తక్కువ. నేలలో నత్రజని నిల్వలను పెంచి భూసారాన్ని పెంపొందిస్తాయి. నువ్వులు, వేరుశనగ వంటి పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉంది. వర్షాలు తక్కువగా ఉన్నా, దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది.
రైతులకు కలిగే ప్రయోజనాలు..
● తక్కువ సాగునీటితో పంటల సాగు.
● విద్యుత్ వినియోగం, సాగు వ్యయం తగ్గుతుంది.
● వర్షాభావ పరిస్థితులను తట్టుకునే అవకాశం.
● పంటల వైవిధ్యంతో ఆదాయం పెరుగుతుంది.
● నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వ్యవసాయ శాఖ సూచనలు ...
● స్థానిక వర్షపాతాన్ని బట్టి పంటలను ఎంచుకోవాలి.
● ధ్రువీకరించిన విత్తనాలను వినియోగించాలి.
● నేల పరీక్షలు చేయించి ఎరువులు వాడాలి.
● వర్షపు నీటిని పొలాల్లో నిల్వ చేసే చర్యలు చేపట్టాలి.
● డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను వినియోగించాలి.
పంట పంట కాలం నీటి అవసరం ప్రధాన ప్రయోజనం
మొక్కజొన్న 100–110 రోజులు తక్కువ మంచి మార్కెట్ ధర
జొన్న 95–110 రోజులు చాలా తక్కువ ఎండను తట్టుకుంటుంది
సజ్జ 70–85 రోజులు చాలా తక్కువ త్వరగా దిగుబడి
రాగులు 95–110 రోజులు తక్కువ పోషక విలువలు అధికం
పెసర 65–75 రోజులు చాలా తక్కువ త్వరగా ఆదాయం
మినుములు 70–80 రోజులు తక్కువ మంచి ధర
కందులు 150–180 రోజులు తక్కువ దీర్ఘకాలిక లాభం
నువ్వులు 80–90 రోజులు తక్కువ నూనెగింజలకు మంచి డిమాండ్
వేరుశనగ 100–120 రోజులు మోస్తరు మంచి ఆదాయం
పత్తి 160–180 రోజులు మోస్తరు మార్కెట్లో మంచి డిమాండ్
రైతులు ఇప్పటికే వరిసాగు కోసం రూ.వేలు ఖర్చు చేశారు. విత్తనాలు కొని నార్లు పోశారు. రైతులకు పూర్తిగా అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించి నష్టపోకుండా చూడాలి. తక్కువ నీటితో పండే పంటలకు మద్దతు ధర ప్రకటించి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి.
– వై.పుల్లారెడ్డి, రైతు, గొమ్ముగూడెం
వరికి బదులు ఇతర పంటలను సాగు చేయాలంటూ క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పెసర, మినుము, కందులు, మొక్కజొన్న, సోయాబీన్ వంటివి సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని వివరిస్తున్నాం. అవసరమైన విత్తనాలను 50 శాతం సబ్సిడీతో రైతులకు అందించేందుకు సిద్ధం చేస్తున్నాం.
– బాబూరావు, డీఏఓ


