భద్రాచలంఅర్బన్: మహిళా సర్పంచ్ మృతికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేసిన వైద్యం వికటించడమే కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగిన ఘటన పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. పాల్వంచ మండలం దంతలబోరు ఎస్సీకాలనీ సర్పంచ్ సోడే వెంకటరమణ (36) శుక్రవారం మృతి చెందగా మృతదేహాన్ని అంబులెన్స్లో భద్రాచలం తీసుకుని వచ్చి సదరు ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగిన విషయం విదితమే. కాగా, శనివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో సదరు ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రి మార్చరీకి తరలించారు. కాగా, ఆస్పత్రి వైద్యులు మృతురాలి బంధువులకు సమాధానం చెప్పకపోగా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని.. మృతురాలి బంధువులతో పాటు సీపీఐ నాయకులు మండిపడ్డారు. వెంటనే వైద్యుడు బయటకు రావాలని, బాధితురాలి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించి, మృతురాలి పిల్లలను ఆదుకోవాలని నినాదాలు చేశారు. డాక్టర్ ఎంతకీ బయటకు రాకపోవడంతో మృతురాలి భర్త ప్రేమ్కుమార్ ఆస్పత్రి వెనుక వైపు నుంచి లోపలికి చొచ్చుకుని వెళ్లి రెసెప్షన్ కౌంటర్పై పెట్రోల్ ప్యా కెట్లు విసిరి లైటర్తో నిప్పు అంటించాడు. అక్కడే ఉన్న ఆస్పత్రి నిర్వాహకులు, సిబ్బంది ప్రేమ్కుమార్ను బయటకు పంపించారు. అనంతరం మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో సీపీఐ నాయకులు, తదితరులు ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపారు. అనంతరం మార్చురీలో ఉన్న సోడే వెంకటరమణ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు పాల్వంచకు తరలించారు.
పెట్రోల్ ప్యాకెట్లు విసిరి,
నిప్పంటించిన మృతురాలి భర్త


