జిల్లాలో 3,714 వాహనాల తనిఖీ
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో గురువారం ఉదయం రెండు గంటల పాటు పోలీసులు ప్రత్యేక నాకా బందీ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా వాహన తనిఖీలు చేపట్టడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. మొత్తంగా 3,714 వాహనాలను తనిఖీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్ లేని 510 మంది, కార్లలో సీటు బెల్ట్ ధరించని 106 మందితో పాటు మైనర్లు నడిపిన 14 వాహనాలను గుర్తించారు. అంతేకాక నంబర్ ప్లేట్ మార్చిన 308 వాహనాలు, సైలెన్సర్ మార్చిన నాలుగు వాహనాలు గుర్తించడమే కాక ఏడుగురిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసిన పోలీసులు... 22 వాహనాలను సీజ్ చేశారు. అలాగే, నిబంధనలు ఉల్లంఘించిన 764 మందికి చలాన్లు విధించడమే కాక 1,567 వాహనదారుల నుంచి జరిమానా వసూలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్రాజ్ మాట్లాడుతూ జిల్లాలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం ప్రత్యేక నాకాబందీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా అసాంఘిక కార్యకలాపాల సమాచారం తెలిస్తే ప్రజలు పోలీసులకు తెలియచేయాలని సూచించారు.


