అశ్వాపురం: మండల పరిధిలోని మణుగూరు భారజల కర్మాగారం ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికలు గురువారం ముగిశాయి. కర్మాగారంలోని క్యాంటీన్–1లో పోలింగ్ నిర్వహించగా, 412 మంది ఉద్యోగులకు గాను 364 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, 14 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. పోలైన ఓట్లను శుక్రవారం లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికల అధికారిగా భారజల కర్మాగారం సైంటిఫిక్ అధికారి మయాంక్చౌదరి వ్యవహరిస్తున్నారు.
ఉద్యోగులను
అభినందించిన ఎస్ఈ
సూపర్బజార్(కొత్తగూడెం): ట్రాన్స్కో – డిస్కం ఇంటర్ సర్కిల్ వాలీబాల్ టోర్నీ ఇటీవల హనుమకొండలో జరగగా ఉమ్మడి జిల్లా జట్టు వరుసగా ఆరోసారి విజేతగా నిలిచింది. కెప్టెన్గా వ్యవహరించిన ఉద్యోగి ఆర్.శ్రీనివాసరాజు తదితరులను విద్యుత్ ఎస్ఈ గొట్టిముక్కుల మహేందర్ గురువారం కొత్తగూడెంలో అభినందించారు. జట్టు సభ్యులు జి.వెంకటేశ్వరరావు, ఎన్.సతీశ్, పి.శివ, కె.రామ్కుమార్, ఎస్.భాస్కర్, జి.శివాజీతో పాటు డీఈలు పీఎస్వీఎస్ నందయ్య, కె.జీవన్కుమార్, జి.రంగస్వామి, బి.వెంకటేశ్వర్లు, ఎస్ఏఓ శ్రీధర్ పాల్గొన్నారు.
ఉచిత శిక్షణకు
దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్లో 125 రోజుల ఉచిత ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.శ్రీలత తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన ఉమ్మడి జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈ బీసీ, అనాథ అభ్యర్థులకు గ్రూప్–1, 2, 3, 4తో పాటు బ్యాంకింగ్, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, పోలీస్ నియామక పరీక్షలకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. హాజరుశాతం ఆధారంగా స్టైఫండ్ కూడా మంజూరవుతుందని తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించకూడదని.. డిగ్రీ మార్కులు, రిజర్వేషన్లు, సీట్ల లభ్యత ఆధారంగా ఎంపిక ఉంటుందని వెల్లడించారు. అయితే, రెగ్యులర్ కోర్సులు చదువుతున్న వారు, ఉద్యోగాలు చేస్తున్నవారు, గతంలో స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన అనర్హులని తెలిపారు. ఈనెల 25 నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు www. tgbcstudycircle. cgg. gov. in సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 18 జాబితా ప్రకటించి, 20న సర్టిఫికెట్లు పరిశీలించాక 25వ తేదీ శిక్షణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో లేదా 08742–227427, 94419 31359, 90597 93456 నంబర్లలో సంప్రదించాలని డైరెక్టర్ సూచించారు.
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ
భద్రాచలంటౌన్: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో జరుగుతున్న జాతీయ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ టోర్నీలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. టోర్నీలో తెలంగాణ రాష్ట్రం క్లాసిక్ విభాగంలో ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించగా, బృందంలో జిల్లా క్రీడాకారులే అత్యధిక పతకాలు సాధించారని పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ రామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు మల్లేశ్ నాలుగు స్వర్ణ పతకాలు, డీవీ శంకరరావు, ఎండీ అబ్బాస్ ఎనిమిది చొప్పున రజత పతకాలు కై వసం చేసుకున్నారని పేర్కొన్నారు. అలాగే శేషు కాంస్య పతకం సాధించగా, కరుణాకుమార్ తొమ్మిదో స్థానం దక్కించుకున్నారని తెలిపారు. క్రీడాకారులను అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భోగాల శ్రీనివాస్రెడ్డితో పాటు డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్, మహంతి వెంకటకృష్ణాజీ, శోభన్నాయక్ తదితరులు అభినందించారు.
ఉత్సాహంగా... ఉల్లాసంగా
కొనసాగుతున్న యోగా పోటీలు
కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో రీజినల్ స్థాయి యోగా పోటీలు గురువారం రెండో రోజుకు చేరాయి. ఈ పోటీలకు రీజియన్ పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, పుదుచ్ఛేరి రాష్ట్రాలకు చెందిన 288 మంది విద్యార్థులు హాజరు కాగా, ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. విద్యార్థులు యోగా విన్యాసాలతో ప్రతిభ చాటుతున్నారు. పోటీలను ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ వెంకటరమణ, యోగాసన భారత్ జాతీయ సహాయ కార్యదర్శి నందనం కృపాకర్, ప్రసన్నకుమార్, రామిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.


