కల్లూరురూరల్: కల్లూరు శివారులో గంజాయి విక్రయాలు జరుపుతున్న ఐదుగురితో కూడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.11.55 లక్షల విలువైన 23.100 కేజీల గంజాయితో పాటు ఒక ఆటో, రెండు బైక్లు, రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు కల్లూరు ఏసీపీ వసుంధరయాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆమె వెల్లడించిన వివరాలు.. కల్లూరు ఎస్ఐ డి.హరిత, సిబ్బందితో గురువారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా శివార్లలో కొందరు వ్యక్తులు కనిపించారు. పోలీసులను చూసి వీరు పారిపోయే ప్రయత్నం చేయగా వెంటబడి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పారిపోయారు. పట్టుబడిన వారి వద్ద 23 కేజీలకు పైగా గంజాయి లభించిందని ఏసీపీ తెలిపారు. పాల్వంచలో నివాసముండే ఆటో, కారుడ్రైవర్లు మహమ్మద్ అన్వర్, వజీర్ఖాన్, కల్లూరు వాసి ముజాహిద్ బాషా, హైదరాబాద్లోప్రైవేట్ ఉద్యోగం చేసే దేవర రాకేశ్, సికింద్రాబాద్కు చెందిన బట్టల వ్యాపారి మహమ్మద్ ఆదిల్ పట్టుబడగా, ఒడిశా మల్కాన్గిరికి చెందిన రాజు, కార్తీక్ పారిపోయారని వెల్లడించారు. కాగా, అన్వర్ ఒడిశాలో రాజు, కార్తీక్ వద్ద గంజాయి తీసుకొచ్చి పాల్వంచ, కొత్తగూడెంలో ఎక్కువ ధరకు అమ్మేవాడని, ఓసారి జైలుకు వెళ్లివచ్చాక రాకేశ్కు కేజీ రూ.12 వేలు చొప్పున అమ్మడం మొదలుపెట్టాడని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన సత్తుపల్లిరూరల్ సీఐ ముత్తు లింగయ్య, కల్లూరు ఎస్ఐ హరిత, సిబ్బంది నర్సింహారావు, రంగారావు, రఫీ, విజయకాంత్, ఎ.ప్రసాద్ను ఏసీపీ వసుంధర అభినందించారు.
కల్లూరులో ఐదుగురి అరెస్ట్


