సత్తుపల్లి(పెనుబల్లి): పెనుబల్లి మండలం లంకపల్లి సమీపాన జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బొగ్గు టిప్పర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన బొగ్గు టిప్పర్ ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ మేరకు టిప్పర్ ముందు భాగం నుజ్జునుజ్జు కాగా డ్రైవర్, చండ్రుగొండ మండలం తిప్పనపల్లికి చెందిన ఎస్.కె.ఖలీల్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. దీంతో వీఎం బంజర పోలీసులు చేరుకుని స్థానికుల సహకారంతో అరగంట పాటు శ్రమించి డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం 108 వాహనంలో పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొత్తగూడెం నుంచి సత్తుపల్లికి బొగ్గు లోడింగ్ కోసం వెళ్తున్న సమయాన డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
ముగ్గురు మహిళలకు
జైలు శిక్ష..
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని ఓ జ్యూయలరీ దుకాణంలో 2025 జూలై 7న ముగ్గురు మహిళలు రూ.30 వేలు విలువ గల వెండి వస్తువులు చోరీ చేసిన ఘటనలో వారికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి శివనాయక్ గురువారం తీర్పు చెప్పారు. ఒక్కొక్కరికీ రూ.500 జరిమానా విధించారు. వివరాలిలా ఉన్నాయి. భూక్యా కేల, గుగులోతు మీరా, భూక్యా వసంత జ్యూయలరీ దుకాణంలో చోరీ చేయగా.. బర్ల నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి, కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారించిన న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు.


