ఖమ్మంవ్యవసాయం: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటిస్తూ రైతులకు ఇబ్బంది రాకుండా పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు మార్క్ఫెడ్ ద్వారా అమల్లో ఉన్న ఫ్రైట్ ఆన్ లారీ(ఎఫ్ఓఎల్) సౌకర్యాన్ని ఈనెల 15నుంచి నిలిపివేసినట్లు వెల్లడించారు. ఫలితంగా మార్క్ఫెడ్ గిడ్డంగులు, రేక్ హెడ్ల నుంచి సరఫరా అయ్యే ఎరువులకు సంబంధించి రవాణా చార్జీలను నిబంధనల ప్రకారం వసూలు చేయాలని సూచించారు. పీఏసీఎస్లకు నష్టం జరగకుండా ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. కాగా, ఎరువుల విక్రయం, రవాణా చార్జీలకు వేర్వేరు రశీదు పుస్తకాలు నిర్వహిస్తూ రైతుల సంతకాలుతీసుకోవాలని ఆదేశించారు. కంపెనీల నుంచి నేరుగా ఎఫ్ఓఎల్ విధానంలో సరఫరా అయ్యే ఎరువులకు ఎలాంటి రవాణా చార్జీలు వసూలు చేయొద్దని స్పష్టం చేశారు. ఎక్కడైనా అధికంగా వసూలు చేస్తే రైతులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఓ ప్రకటనలో సూచించారు.


