రుద్రంపూర్: కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కోయగూడెం–3, సత్తుపల్లి–3, మణుగూరు డిప్సైడ్, శ్రావణపల్లి బ్లాక్లను, ఆక్షన్లో పెట్టుకున్న 17 బ్లాక్లను కేటాయించి నిజాయితీని నిరూపించుకోవాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ పేర్కొన్నారు. ఆదివారం కొత్తగూడెంలో కార్పొరేట్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐటీయూసీ, ఎన్టీయూసీ యూనియన్లు తామంటే తాము మెడికల్ బోర్డులు పెట్టించామని చెప్పుకుంటున్నాయని, అందులో కేవలం 20 శాతం అన్ఫిట్ చేయడం కార్మికులను మోసం చేసినట్లేనని విమర్శించారు. సుమారు 17 మాసాలు ఎదురుచూసిన వారిలో కనీసం 60, 70 శాతం అన్ఫిట్ చేయాల్సి ఉందన్నారు. సమావేశంలో వైస్ ప్రసిడెంట్ పూసల వీరభద్రం, తుమ్మ శ్రీనివాస్, గడప రాజయ్య, వసీకర్ల కిరణ్, కాగతపు విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రస్తుత మెడికల్ బోర్డ్ను వెంటనే రద్దు చేసి, తిరిగి మెడికల్ బోర్డ్ నిర్వహించాలని ఏఐటీయూసీ అదనపు కార్యదర్శి మిరియాల రంగయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించిన మెడికల్ బోర్డ్ బూటకపు ప్రక్రియ అని, దీనిని వెంటనే రద్దు చేసి, గతంలో అమలు చేసిన విధానంలోనే మెడికల్ బోర్డ్ నిర్వహించాలని కోరారు. ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీస్ కారణంగానే యాజమాన్యం మెడికల్ బోర్డ్ నిర్వహించేందుకు ముందుకు వచ్చిందని, కానీ, బోర్డ్ పారదర్శకంగా జరగలేదని, కార్మికులకు భవిష్యత్ లేకుండా చేశారని ఆరోపించారు. అనారోగ్యంతో ఉన్నవారిని అన్ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు.


