భద్రాచలం: చిత్రకూట మండపాన్ని శ్రీ భద్రాచల సీతారామాలయ ఉద్దరణ సంఘం ఆధ్వర్యంలో 45 ఏళ్ల క్రితం నిర్మించారు. అప్పటి ఉప ప్రధాని మొరార్జీ దేశాయ్ జూలై 15, 1967లో శంకుస్థాపన చేయగా, 1982లో ఏప్రిల్ 4న నాటి దేవాదాయ శాఖ మంత్రి పీవీ చౌదరి ప్రారంభించారు. అప్పటి నుంచి ఆలయంలో జరిగే పలు ఉత్సవాలకు వేదికగా నిలుస్తోంది. ప్రభుత్వం రామాలయ ఆధునికీకరణ పనుల్లో భాగంగా చిత్రకూట మండపాన్ని పూర్తిగా తొలగించనుంది. మరో రెండు, మూడు రోజుల తర్వాత ఇక కనిపించదు.
రూ.21వేలకు చేరిన మిర్చి ధర
ఖమ్మంవ్యవసాయం: ‘తేజా’ రకం మిర్చి ధర దూసుకెళ్తోంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత శుక్రవారం క్వింటా ధర రూ.20,100 పలకగా, సోమవారం రూ.21వేలకు చేరింది. అలాగే, కోల్డ్ స్టోరేజీలో నిల్వ మిర్చి ధర రూ.20,500 నుంచి రూ.21,800కు పెరగడం విశేషం. ఏప్రిల్ ఆరంభంలో రూ.19,450 పలికిన ధర 13 రోజుల వ్యవధిలో రూ.1,550 పెరిగింది. పంట సాగుతో పాటు దిగుబడులు తగ్గడంతో దేశీయ మార్కెట్లో మిర్చికి డిమాండ్ పెరగగా ధర పెరుగుతున్నట్లు విశ్లేషిస్తున్నారు. దీంతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన రైతులు కూడా అమ్మకానికి మొగ్గుచూపుతున్నారు.


