పాల్వంచరూరల్ : మార్చి 14 నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు సోమవారం ముగియగా, జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. చివరి రోజు పరీక్షకు 12,728 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 12,699 మంది విద్యార్థులు హాజరయ్యారు. 29 మంది గైర్హాజరైనట్లు డీఈఓ బి.నాగలక్ష్మి తెలిపారు. చివరి రోజు పరీక్ష కేంద్రాలను కలెక్టర్ అంకిత్, డీఈఓ తదితరులు తనిఖీ చేశారు. కాగా పరీక్షలు ముగియడంతో హాస్టళ్లు, గురుకులాలను ఖాళీ చేసి విద్యార్థులు ఇంటిబాట పట్టారు.
పరీక్ష కేంద్రంలో కలెక్టర్ తనిఖీ
పాల్వంచ: పట్టణంలోని బొల్లేరుగూడెం జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాల పదో పరీక్ష కేంద్రంలో సోమవారం కలెక్టర్ అంకిత్ఆకస్మికంగా తనిఖీచేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. తాగునీటి సదుపాయం, విద్యుత్, ఫ్యాన్లు, శుభ్రత వంటి మౌలిక వసతులపై ఆరా తీశారు. విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్లు, సిబ్బందితో మాట్లాడారు. కలెక్టర్ వెంట ప్రధానోపాధ్యాయులు మంగమ్మ, సంబంధిత శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


