సూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్ అధికారుల నిర్లక్ష్యంతో వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. పౌర సౌకర్యాల నిర్వహణ అధ్వానంగా మారిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మండలాలు, గ్రామాలకు వెళ్లినప్పుడు ఉన్నతా ధికారులంతా పరిశుభ్రత, ఆరోగ్యం సలహాలు, సూచనలు చేస్తుంటారు. కానీ, వారి కార్యాలయాలు ఉండే కలెక్టరేట్లో మాత్రం మరుగుదొడ్ల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఐడీఓసీలోని కాన్ఫరెన్స్ హాల్ సమీపంలో ఉన్న మరుగుదొడ్లలో వాష్ బేసిన్లు, మూత్ర విసర్జన బేసిన్లకు పైపులు లేవు. ప్రజావాణి కార్యక్రమంతో పాటు వివిధ సమస్యలపై ప్రజలు నిత్యం కలెక్టరేట్కు వచ్చిపోయే ప్రజలు మూత్ర విసర్జనకు వెళ్లాలంటే ఇబ్బందులు తప్పడంలేదు.
కదలని బ్యాటరీ వాహనం
కలెక్టరేట్ గేట్ నుంచి కార్యాలయం వరకు వృద్ధులు, దివ్యాంగులను తరలించేందుకు బ్యాటరీ వాహ నం ఏర్పాటు చేశారు. సోమవారం ఆ వాహనం నడపకపోవడంతో ప్రజావాణికి హాజరైన పలువురు వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా సందర్భాల్లో కలెక్టరేట్ సిబ్బందికి ఈ వాహనం వినియోగించుకుంటున్నారు. కానీ అవసరార్థులకు ఉపయోగించడంలేదు. దీంతో వాహన ఏర్పాటు లక్ష్యం నెరవేరడంలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పౌర సౌకర్యాల నిర్వహణ మెరుగుపర్చాలని పలువురు కోరుతున్నారు.


