ఇల్లెందు: పట్టణంలో పలు రేషన్ దుకాణాల్లో పౌరసరఫరాలశాఖ అధికారులు ఆకస్మికంగా తనఖీ చేశారు. ఆదివారం నంబర్–2 బస్తీలోని దుకాణాలను తనిఖీ చేసి, అక్కడి స్టాక్ పాయింట్ ఆధారంగా రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం జీసీసీ ఏరియాలోని షాపు, సత్యనారా యణపురంలో పలు గృహాలను తనిఖీ చేసి, పలు చోట్ల ఇళ్లల్లో నిల్వ చేసిన 100 క్వింటాళ్ల బియ్యాన్ని పౌరసరఫరాలశాఖ అధికారి ప్రేమ్కుమార్ పట్టుకున్నారు. పంచనామా నిర్వహించి జీసీసీకి తరలించారు. డీటీలు మహేశ్, ప్రభాకర్, రాజు, రాంబాబు పాల్గొన్నారు.
నిబంధనలు పాటించాలి..
ములకలపల్లి: సేవలు అందించే అన్ని ప్రైవేట్ సంస్థలు, ప్రాక్టీషనర్లు ప్రభుత్వం నిర్ణయించిన బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధన లు, ఔషధ వినియోగ మార్గదర్శకాలు పాటించాల్సిందేనని డీఎంహెచ్ఓ తుకారాంరాథోడ్ స్పష్టం చేశారు. ములకలపల్లిలోని ప్రైవేట్ ప్రాక్టీషనర్లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను ఆదివా రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అసహనం వ్యక్తం చేశారు. మెడికల్ వ్యర్థాలు నేరుగా జీపీ సిబ్బంది సేకరించే చెత్తతో కలిపి పారవేస్తున్నట్లు గుర్తించారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు పరిమితికి మించి బెడ్లు, స్టాండ్ల ఏర్పాటు, అధిక యాంటిబయాటిక్స్ వాడుతున్న ట్లు గుర్తించి, నోటీసులు జారీ చేశారు. ప్రోగ్రాం ఆఫీసర్ (సీహెచ్ఐ) సి.ప్రతాప్, డీపీఎంఓ ప్రతాప్ పాల్గొన్నారు.
సింగరేణి సొత్తు చోరీ
పట్టుకున్న సెక్యూరిటీ అధికారులు
మణుగూరుటౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని ఓ కాంట్రాక్ట్ టెండర్ వాహనంలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న సింగరేణి సొత్తును సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఇటీవల టెండర్ దక్కించుకుని ఓసీ–2లో ఓ అధికారి కింద నడుస్తున్న బొలెరో వాహనంలో డ్రైవర్ సుమారు 220 కేజీల ఐరన్ను వెనుక సీట్ల కింద ఉంచి తరలిస్తుండటంతో శబ్దం పెద్దఎత్తున వచ్చింది. దీంతో ఆ అధికారికి అనుమానం వచ్చి తిరిగి వాహనాన్ని క్వారీ వైపు మల్లించి వాహనాన్ని సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించినట్లు తెలిసింది. కాగా ఆదివా రం సాయంత్రం సెక్యూరిటీ అధికారులు పోలీసులను సంప్రదించి వివరాలు తెలిపినట్లు తెలిసింది. అయితే ఆ వాహనం ఓసీ–2లోని ఉద్యోగి.. వాహనానికి బినామీగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
భద్రాచలంఅర్బన్: మతిస్థిమితం లేని వ్యక్తి కనిపించకుండా పోయిన ఘటనపై టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. కొమరంభీమ్ ఆసిఫాబాద్కు చెందిన లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 5వ తేదీన తిరుపతి వెళ్లి.. 9వ తేదీన భద్రాచలంలో రాములోరిని దర్శించుకుని, కూనవరం రోడ్డు వైపు వెళ్లి తప్పుపోయాడు. కుటుంబ సభ్యులు కూనవరం, చింతూరు పరిసర ప్రాంతాలలో వెతికినా అతని ఆచూకీ దొరకలేదు. లక్ష్మణ్ కుమారుడు రాఘవ ఫిర్యాదు మేరకు ఆదివారం టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.


