పాల్వంచ/సూపర్బజార్(కొత్తగూడెం): ఆర్టిజన్లను ఉద్యోగులుగా గుర్తించాలని, ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా పాల్వంచలో కేటీపీఎస్ ఆస్పత్రి ఎదుట మైదానంలో ధర్నా చేపట్టి వంటావార్పు నిర్వహించారు. జేఎసీ, ట్రేడ్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. ఒకే సంస్థలో వేర్వేరు రూల్స్ ఎలా వర్తింపజేస్తారని, సమస్యలు పరిష్కరించే వరకూ విధుల్లోకి వెళ్లబోమని తేల్చిచెప్పారు. కాగా, సాయంత్రం 5 గంటల వరకు విధుల్లోకి రాకుంటే తొలగిస్తామని యాజమాన్యం బెదిరింపు ధోరణికి పాల్పడుతుందని, ఈనెల 13న లేబర్ కమిషనర్తో చర్చలు ఉండగా ఏవిధంగా డిస్మస్ చేస్తారని ప్రశ్నించారు. నాయకులు సాయిలు, పురుషోత్తంరావు, బాలకృష్ణ, అనిల్, నర్సింహారెడ్డి, రమేష్, సాంబ, రవీందర్, రాములు, జలీల్, కోటేశ్వరరావు, రాజేందర్, సాధం రామకృష్ణ, సతీష్రెడ్డి, మల్లయ్య, వేణుగోపాల్రెడ్డి, సాయిబాబు, వెంకట్రావ్, రమేష్, సాంబ, రవీందర్, శ్రీనివాసరావు, శారద నిమ్మల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే కొత్తగూడెం డివిజన్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన సమ్మెలో ఆర్టిజన్లకు విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని, ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ సర్వీసు రూల్స్ వర్తింపజేయాలి నినాదాలు చేశారు. సమ్మెకు మద్దతుగా టీజీయూఈఈయూ(సీఐటీయూ) కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి పులి గణేష్బాబు, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ నుంచి కత్తి శ్రీనివాస్, సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మాచారి, సీపీఎం పట్టణ కార్యదర్శి బాలరాజు, సింగరేణి సీఐటీయూ అధ్యక్షుడు మంద నరసింహారావు, టీచర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ నాయక్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ కూనూరాజు శ్రీనివాస్, కొత్తగూడెం డివిజన్ చైర్మన్ మోతీరామ్, కన్వీనర్ రాంబాబు, కో కన్వీనర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
డిస్మిస్ చేస్తామంటూ అల్టిమేటం..
తమ సమస్యల పరిష్కారానికి పాల్వంచలోని కేటీపీఎస్ 5,6,7 దశల కర్మాగారాల్లో ఉన్న కార్మికులు 95శాతం మంది విధులకు గైర్హాజరు అయ్యారు. అయితే సాయంత్రం షిప్ట్లోగా విధుల్లోకి రాకుండా యాజమాన్యం డిస్మస్ చేస్తామని చెప్పడంతో కొంతమంది మాత్రమే విధుల్లోకి వెళ్లారు.


