● ఎమ్మెల్యే శంకుస్థాపన చేసినా ఇంటికి అడ్డంకులు ● నిర్మాణం చేపట్టి మూడు నెలలు అవుతున్నా పట్టింపు కరువు
దుమ్ముగూడెం : మండలంలోని ములకపాడు గ్రామానికి చెందిన తాటి లక్ష్మికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ఇంటి నిర్మాణం ప్రారంభించి మూడు నెలలు కావొస్తున్నా నేటికీ పంచాయతీ కార్యదర్శి ఫొటో తీయలేదని ఎంపీడీఓ, తహసీల్దార్లకు గురువారం ఫిర్యాదు చేసింది. ములకపాడు గ్రామంలోని సర్వే నెం.149/1పి/1 గల భూమిలో గుడిసె వేసుకుని గత 35 ఏళ్లుగా లక్ష్మి తన పిల్లలతో కలిసి జీవిస్తోంది. ఈక్రమాన ఇటీవల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, తహసీల్దార్, ఎంపీడీఓల సమక్షంలో భూమి పూజ చేపట్టి ఇంటి నిర్మాణం చేపట్టింది. అయితే మూడు నెలలు గడుస్తున్నా నేటికీ ఇంటి నిర్మాణ ఫొటో తీయడంలో నిర్లక్ష్యం చేస్తుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఒకే స్థలం ఇద్దరికి..
కాగా, అదే సర్వే నంబర్లో 2008వ సంవత్సరంలో అప్పటి తహసీల్దార్ మూడు సెంట్ల భూమి తనకు కేటాయించారని తెలిపారు. అయితే అదే సర్వే నంబర్ 149/1పి/1లో గల 1.1880 భూమిని మరో గిరిజన మహిళకు ప్రభుత్వం కేటాయించిందన్నారు. దీంతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ సమయంలో ముగ్గురు వ్యక్తులు తమపై దాడి చేసి, దుర్భాషలాడారని దీనిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిలో చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం సక్రమంగా జరిగేలా అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కుటుంబం అంతా పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.


