భద్రాచలంఅర్బన్: తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం జిల్లా వైద్యాధికారుల ఆదేశాల మేరకు భద్రాచలం సబ్ జైల్లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైదీలకు జిల్లా క్షయ వాధి నివారణ అధికారి డాక్టర్ పుల్లారెడ్డి, పీపీఎం, ఏసీఎస్ఎం కోర్డినేటర్ డాక్టర్ సోమయ్యలు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. రెండు వారాల పాటు దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం వంటి సమస్యలు ఉన్నట్లయితే వెంటనే ఎక్స్రే, తేమడ పరీక్షలు చేయించుకోవాలన్నారు. వ్యాఽధి నిర్థారణ అయితే ఆరు నెలలు క్రమం తప్పకుండా మందులు వాడాలని, అందుకు పోషణ భత్యం కింద ప్రభుత్వం ప్రతి నెలా రూ.వెయ్యి అందిస్తుందని చెప్పారు. అనంతరం ఖైదీలకు ఎయిడ్స్, బీపీ, ఆర్బీఎస్, సిప్లిస్, హెపీవీ, హెచ్బీఎస్ఏజీ–1,2లకు సంబంధించిన రక్తపరీక్షలతో తేమడ పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరత్, భద్రాచలం ఏడీటీసీఓ డాక్టర్ పావనిరెడ్డి, ఇతర వైద్యులు, సిబ్బంది, పాల్గొన్నారు.


