భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో గురువారం రామయ్య కల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోకంగా జరిపారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం వైభవంగా సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు.
రైల్వే సమస్యలపై
స్పందించండి
రైల్వే మంత్రిత్వ శాఖ ఈడీకి
ఎంపీ రఘురాంరెడ్డి వినతి
కొత్తగూడెంఅర్బన్: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పెండింగ్ రైల్వే సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) వికాస్కుమార్ జైన్కు గురువారం ఆయన వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల మీదుగా వెళ్లనున్న డోర్నకల్ – మిర్యాలగూడ, డోర్నకల్ – గద్వాల లైన్ అలైన్మెంట్ను మార్చి వెన్నారం, కురవి, అబ్బాయిపాలెం, మరిపెడ, మోతె మీదుగా లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, భద్రాచలం రోడ్(కొత్తగూడెం) రైల్వేస్టేషన్ నుంచి న్యూ గొల్లగూడెం మీదుగా రహదారి విస్తరణకు 4,556 చ.మీ. రైల్వే భూమి అవసరమని తెలిపారు. ఇందుకు బదులుగా ఖమ్మం రైల్వేస్టేషన్ వద్ద 9,969.5 చ.మీ. రాష్ట్ర ప్రభుత్వ భూమి ఇవ్వనున్నందున ఇరు జిల్లాల కలెక్టర్లు పంపిన ప్రతిపాదనలను ఆమోదించాలని ఎంపీ కోరారు.
ఎయిడ్స్పై
అవగాహన ర్యాలీ
చుంచుపల్లి: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం ఎయిడ్స్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాత బస్ డిపో నుంచి ప్రారంభమైన ర్యాలీ కొత్తగూడెం రైల్వే స్టేషన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ ఎయిడ్స్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సిలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ వివాహానికి ముందు స్వచ్ఛందంగా హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ డి. ప్రసాద్, ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సిబ్బంది, కార్యక్రమ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


