● అశ్వారావుపేట, ఇల్లెందులో పర్యటించిన కలెక్టర్ అంకిత్ ● ఇల్లెందులో ఇద్దరు వార్డెన్ల సస్పెన్షన్కు ఆదేశం
అశ్వారావుపేట: విధుల్లో చేరిన నాటి నుంచి పాఠశాలలు, ఆస్పత్రుల్లో తనిఖీలు చేస్తున్న కలెక్టర్ అంకిత్ మంగళవారం కూడా కొనసాగించారు. ఈమేరకు అశ్వారావుపేట మైనార్టీ గురుకుల పాఠశాల, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మైనారిటీ గురుకులంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించడమే కాక డైనింగ్ హాల్, స్టోర్ రూం నిర్వహణపై ఆరా తీశారు. నిల్వ ఉంచిన బెల్లం నాణ్యతపై సందేహం వ్యక్తం చేసి సరఫరాదారుల వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు తాజా సరుకులతో నాణ్యమైన ఆహారం అందించాలని, వడ్డించేముందు నాణ్యత పరిశీలనలో 8, 9, 10వ తరగతి విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఆతర్వాత విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ ఆహార నాణ్యత, మెనూ అమలుపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మండల పరిషత్ పాఠశాలలోనూ మధ్యాహ్న భోజనం తయారీని పరిశీలించారు. ఆతర్వాత ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వెళ్లిన కలెక్టర్ రోజువారీ వైద్యసేవలపై ఆరా తీశాక డయాలసిస్ సెంటర్ను పరిశీలించారు. చికిత్స పొందుతున్న వారికి ఇచ్చే ఆహారం, కిచెన్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ నాణ్యమైన ఆహారాన్ని అందించడమే కాక భోజనంలో గుడ్డు, అరటిపండు ఉండాలని ఆదేశించారు. అనంతరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ప్రతిపాదిన స్థలాన్ని పరిశీలించారు. తహసీల్దార్ కిషోర్, ఎంపీడీఓ అప్పారావు, మున్సిపల్ కమిషనర్ బి.నాగరాజు, ఆర్ఎంఓ మౌనిక, గురుకులం ప్రిన్సిపాల్ టి.సంగీత తదితరులు పాల్గొన్నారు.


