దుమ్ముగూడెం: మండలంలోని ములకపాడు గ్రామానికి చెందిన బోడ బాబూరావు (72) వడదెబ్బకు గురై శుక్రవారం మృతిచెందాడు. బాబూరావు గురువారం అంతా వ్యక్తిగత పనులపై బయట తిరుగగా అస్వస్థతకు గురై, వాంతులు, విరేచనాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్సఅందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. ములకపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
పాల్వంచరూరల్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కరీంనగర్లోని నోసలాపుర్కు చెందిన, హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న గుర్రం దుర్గారావు (48) పాల్వంచలోని వెంగళరావుకాలనీలో ఉన్న ఇంటిని విక్రయించేందుకు కొద్దిరోజుల క్రితం వచ్చాడు. నాగారంకాలనీ పాత చెక్పోస్టు వద్ద టీకొట్టు పెట్టుకున్న తన బంధువు రమణమ్మ వద్దకు వచ్చి వెళ్తుంటాడు. శుక్రవారం కూడా టీకొట్టు నుంచి ఎదురుగా ఉన్న లారీ సర్వీస్ సెంటర్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా పాల్వంచ నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో దుర్గారావు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య పద్మ, కుమారుడు ఉన్నారు. ఎస్ఐ సురేశ్ మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇసుక లారీలు సీజ్
దమ్మపేట/బూర్గంపాడు: ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని దమ్మ పేట పోలీసులు శుక్రవారం సీజ్ చేశారు. ఏపీలోని కుక్కునూరు ప్రాంతం నుంచి అనుమతి లే కుండా మండలంలోని గంగుల గూడెంకు వచ్చిన లారీ.. ఇసుక డంప్ చేసి వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డంప్ చేసిన ఇసుకను సీజ్ చేయడమే కాక లారీని తహసీల్దార్కు అప్పగించామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి వెల్లడించారు. అలాగే, పరిమితికి మించి ఇసుక తీసుకెళ్తున్న లారీని బూర్గంపాడు పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. లోడ్కు మించి ఉండటంతో తదుపరి చర్యల కోసం తహసీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు.


