● బ్రహ్మోత్సవాలలో మండల లేఖ కలశ పూజలు ● నేడు ధ్వజపట లేఖనం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వసంత పక్ష ప్రయుక్త బ్రహ్మోత్సవాల పూజా కార్యక్రమాలు సోమవారం ప్రారంభమయ్యాయి. స్వామి వారి ఉత్సవమూర్తులను బేడా మండపంలో కొలువుదీర్చి స్నపన తిరుమంజనం గావించారు. పండితులు, అర్చకులు వేదపఠనం చేశారు. అలాగే మండల లేఖ, కుండ, కలశ పూజ లను యాగశాలలో నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన స్వామి వారిని సార్వభౌమ సింహాసనంపై ఆశీనులు చేసి తాతగుడి సెంటర్లోని గోవిందరాజ స్వామి వారి ఆలయం వద్ద వరకు తిరువీధి సేవ గావించారు.
నేడు జీయర్మఠంలో ధ్వజపట లేఖనం
ఉత్సవాల్లో భాగంగా మంగళవారం గరుడాధి వాసం, ధ్వజపట లేఖనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు ప్రధాన సంకేతమైన గరుత్మంతుడి బొమ్మను వస్త్రంపై లిఖించే ప్రక్రియను జీయర్ మఠంలో చేపడతారు. 25న అగ్ని ప్రతిష్ఠ, ధ్వజా రోహణం, దేవతాహ్వానం, బలిసమర్పణ, హనుమద్వాహన సేవలు నిర్వహిస్తారు. 26న యాగశాల పూజ, చుతుఃస్థానార్చన, గజ, గరుడ వాహన సేవలు, ఎదుర్కోలు ఉత్సవం జరుగుతాయి.


