24 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం
భద్రాచలంటౌన్: పట్టణంలోని హోటళ్లలో పౌరసరఫరాలశాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. తనిఖీల్లో గృహ వినియోగానికి సంబంధించిన 24 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని, స్థానిక గ్యాస్ ఏజెన్సీకి అప్పగించినట్లు పౌరసరఫరాలశాఖ డీటీ జి.రాజులు తెలిపారు. హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ కేంద్రాల్లో కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వాడాలని, నిబంధనలు ఉల్లంఘించి గృహ అవసరాల సిలిండర్లను ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ముకుందాపురంలో పట్టపగలే చోరీ
ఇల్లెందురూరల్: మండలంలోని ముకుందాపురంలో శుక్రవారం పట్టపగలే చోరీ జరిగింది. గ్రామానికి చెందిన రైతు రాయల శ్రీను ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి పొలం పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం శ్రీను, అతని కుటుంబ సభ్యులు ఇంటికి వస్తున్న సమయంలో ఇంట్లో నుంచి ఓ వ్యక్తి వేగంగా పరిగెత్తడం గమనించారు. అతని వెంట పరుగెత్తిన శ్రీను కొద్ది దూరంలో గడ్డివాములో దాక్కున్న వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చాడు. అతని వద్ద నుంచి రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నాడు. అతడిని ఇంట్లో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోయిన నగదులో కొంతే దొరకడంతో మిగతా సొమ్ము ఇప్పించాలని రాయల శ్రీను పోలీసులను కోరాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.


