ఎన్నికల ‘ఉపాధి’!
ఖమ్మంమయూరిసెంటర్: మున్సిపల్ ఎన్నికలు కొందరు కూలీలకు ఉపాధిని తెచ్చిపెట్టాయి. ఉదయం, సాయంత్రం పార్టీల జెండాలను పట్టుకుని అభ్యర్థుల వెంట తిరుగుతూ జై కొడితే రూ.200 నుంచి రూ.400 వరకు చెల్లిస్తున్నారు. గత నెల 30వ తేదీతో నామినేషన్లు వేసే గడువు ముగియడంతో ఆ మరుసటి రోజు నుంచే అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలతో పాటు కొత్తగూడెం కార్పొరేషన్లో పలువురు ప్రచారానికి వెళ్తున్నారు. ప్రచార సమయంలో హంగు, ఆర్భాటం ఉండేలా మనిషికి ఇంత చొప్పున నగదు చెల్లించి పలువురిని వెంట తిప్పుకుంటున్నారు. రోజువారీ చేసే ప్రచారంలో తక్కువమంది ఉన్నా.. ముఖ్యనేతలు వార్డుల్లో, డివిజన్లలో ప్రచారానికి వచ్చినప్పుడు, మంత్రులు ప్రచారంలో పాల్గొన్నప్పుడు కొంత హడావుడి ఉంటోంది. ఆ సమయంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో రోజువారీగా పనులు చేసుకునే వారికి ఉపాధి లభిస్తోంది. ఉదయం, సాయంత్రం సమయంలో అభ్యర్థుల వెంట ప్రచారంలో పాల్గొంటే భోజనాలు పెట్టించి రూ. 200 నుంచి రూ. 400 ఇస్తుండటంతో పలువురు కూలీలు ప్రచార బాట పడుతున్నారు.
ప్రచారంలో పాల్గొంటే
ఒక్కొక్కరికి రూ.400 వరకు చెల్లింపు
ఎన్నికల ‘ఉపాధి’!


