నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

Jun 13 2025 5:15 AM | Updated on Jun 13 2025 2:20 PM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన

పాల్వంచరూరల్‌ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. ఆ తర్వాత హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్‌.రజనీకుమారి, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

రామయ్య సన్నిధిలో ఏపీ హైకోర్టు జడ్జి

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని ఏపీ హైకోర్టు జడ్జి గోపాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమమూర్తులను దర్శించుకున్నాక శ్రీ లక్ష్మీతాయారమ్మవారి సన్నిధిలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామి వారి జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో భద్రాచలం జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ శివనాయక్‌, ఆలయ ఏఈఓ శ్రవణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్‌ అన్నారు. ప్రపంచ బాల కార్మిక దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం పెద్దబజారులోని హమాలీ కార్మికులతో గురువారం నిర్వహించిన న్యాయ అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. పేదరికంతో చాలామంది బాలలు కార్మికులుగా మారుతున్నారని అన్నారు. అనంతరం కిరాణా షాపులను తనిఖీ చేశారు. చిన్న పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని యజమానులకు సూచించారు. కార్యక్రమంలో కొత్తగూడెం సహాయ కార్మిక శాఖ అధికారి షర్ఫుద్దీన్‌, మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పల్లపోతు సాయి, హమాలీ కార్మిక సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

36 మంది సర్వే అధికారుల బదిలీ

సింగరేణి(కొత్తగూడెం) : సింగరేణిలోని వివిధ ఏరియాల్లో విధులు నిర్వహిస్తున్న 36 మంది సర్వే అధికారులను బదిలీ చేస్తూ ఈఈ సెల్‌ విభాగాధిపతి ఎ.జె. మురళీధర్‌ రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఏడుగురు సర్వే అధికారులు, 29 మంది జూనియర్‌ సర్వే అధికారులు ఉండగా.. వీరంతా ఈనెల 21లోగా కేటాయించిన ఏరియాల్లో జాయిన్‌ కావాలని సూచించారు.

నేత్రపర్వంగా  రామయ్య నిత్యకల్యాణం1
1/2

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

.2
2/2

రామయ్య సన్నిధిలో ఏపీ హైకోర్టు జడ్జి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement