‘అరుదైన’ అన్వేషణ | - | Sakshi
Sakshi News home page

‘అరుదైన’ అన్వేషణ

Jun 14 2025 7:25 AM | Updated on Jun 14 2025 7:25 AM

‘అరుదైన’ అన్వేషణ

‘అరుదైన’ అన్వేషణ

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నెల రోజుల క్రితం చైనా, అమెరికాల మధ్య మొదలైన టారిఫ్‌ల వార్‌ ఇటీవల సద్దుమణిగింది. తన దగ్గరున్న రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ను (అరుదైన మూలకం) అమెరికాకు ఎగుమతి చేయడంపై చైనా ఆంక్షలు విధించడంతో అమెరికా ఒక అడుగు వెనక్కి తగ్గక తప్పలేదు. దీన్నిబట్టి అంతర్జాతీయంగా రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ ఎంతో ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడీ రంగంలో మైనింగ్‌కు సింగరేణి సంస్థ సిద్ధమవుతోంది.

కీలక ఒప్పందం

రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ మైనింగ్‌ ప్రారంభించేందుకు సింగరేణి ఏడాది కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) – భువనేశ్వర్‌ అనుబంధ సంస్థగా ఉన్న ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ మినరల్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ టెక్నాలజీ (ఐఎంఎంటీ)తో ఇటీవల ఒప్పందం చేసుకుంది. సింగరేణి గనులు ఉన్న ప్రాంతంలో రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ను కనుగొనడం, దేశ పారిశ్రామిక అవసరాలను ఆ మినరల్స్‌ ఏ మేరకు ఉపయోగపడతాయనే అంశాలపై ఈ రెండు సంస్థలు కలిసి పని చేయనున్నాయి.

అరుదైన ఖనిజాల ఆనవాళ్లు

గోదావరి – ప్రాణహిత లోయలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. సంస్థ పరిధిలో 22 భూగర్భ గనులు, 18 ఓపెన్‌కాస్ట్‌ గనులు ఉన్నాయి. ఇందులో కొన్ని ఓపెన్‌ కాస్ట్‌ గనులు ఉన్న చోట అరుదైన ఖనిజాలు ఉన్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. సింగరేణి ఉత్పత్తి చేసిన బొగ్గును థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లకు పంపుతున్నారు. అక్కడ మండించిన బొగ్గు నుంచి వెలువడిన బూడిదలో కూడా కొన్ని రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ అవశేషాలు లభించాయి. ఇప్పటివరకు సింగరేణి ప్రాంతంలో 14 రకాల ఖనిజాల ఉనికిని సైంటిస్టులు కనిపెట్టారు. వీటిలో లైట్‌ రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ కేటగిరీలో లాంథనమ్‌, సిరియమ్‌, ప్రసియోడీమియం వంటి మూలకాలు ఉండగా హెవీ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ విభాగంలో ఇట్రియం, స్కాండియం, డిస్ఫ్రోజియం తదితర ఎనిమిది రకాల మూలకాల జాడ లభించింది. జిల్లాలో మణుగూరు బ్లాక్‌ పరిధిలోకి వచ్చే దుర్గం గుట్టలు (వాజేడు మండలం బొగత జలపాతం క్యాచ్‌మెంట్‌ ఏరియా) దగ్గర సగటున 266.21 పీపీఎం స్థాయిలో రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ ఉన్నట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్వహించిన నమూనా పరీక్షల్లో తేలింది.

ఉపయోగపడతాయా ?

సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతంలో కనిపిస్తున్న రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ పారిశ్రామిక అవసరాలను తీర్చే విధంగా ఉన్నాయా లేదా అనే అంశాన్ని నిర్ధారించేందుకు డీప్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ చేయాల్సిన అవసరముంది. దీని కోసమే భువనేశ్వర్‌లోని ఐఎంఎంటీతో సింగరేణి చేతులు కలిపింది. దేశీయంగా ఉన్న అవకాశాలను పరిశీలిస్తూనే విదేశాల్లో కూడా రేర్‌ ఎర్త్‌ ఖనిజాల అన్వేషణలో ఉంది. ముఖ్యంగా లిథియం మైనింగ్‌ కోసం బొలీవియా, చిలీ, అర్జెంటీనాలో గల అవకాశాలను పరిశీలించింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో అరుదైన ఖనిజాల ఉత్పత్తికి సంబంధించి అవగాహనకు వచ్చినట్టు సింగరేణి యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది.

గోదావరి లోయలో

14 రకాల అరుదైన

ఖనిజాల ఆనవాళ్లు

మరిన్ని పరిశోధనల కోసం ఐఎంఎటీతో ఒప్పందం

సానుకూల ఫలితాలు వస్తే

సింగరేణి దశ తిరిగినట్టే

వరుస ప్రకటనలు

వందేళ్లకు పైగా బొగ్గు ఉత్పత్తికే పరిమితమైన సింగరేణి పదేళ్ల కిందట విద్యుత్‌ ఉత్పత్తి రంగంలోకి వచ్చి సానుకూల ఫలితాలు సాధించింది. ఈ రంగంలో దక్కిన విజయాలు అందించిన ఉత్సాహంతో బహుముఖంగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఓపెన్‌కాస్ట్‌ గనుల నుంచి ఇసుక తీసే విధానం పరిశీలించినా... ఆశించిన ఫలితాలు రాలేదు. ఇల్లెందు, రామగుండంలో ప్రతిపాదించిన పంప్డ్‌ స్టోరేజీ హైడల్‌ పవర్‌ ప్లాంట్‌ అంశం, మణుగూరు దగ్గర జియో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు అంశాల పరిస్థితి ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు రేర్‌ ఎర్త్‌ మైనింగ్‌ అంశం తెర మీదకు వచ్చింది. అయితే ‘అరుదైన’ ప్రయత్నాలు సానుకూల ఫలితాలు అందిస్తే సింగరేణి దశాదిశా మారడం ఖాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement