
కౌలు రైతులకు సాయమేది..?
● రైతు భరోసా ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ● అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఆ ఊసేలేదు ● పెట్టుబడులకు ప్రైవేటు అప్పులతో ఆర్థిక భారం
బూర్గంపాడు: కౌలు రైతులకు పంటల పెట్టుబడి సాయంగా రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవటం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఆ ఊసెత్తటం లేదు. బ్యాంకుల నుంచి పంట రుణాలు ఇవ్వక, రైతు భరోసా అందక కౌలు రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పంట పెట్టుబడులకు ప్రైవేటు అప్పులపైనే ఆధారపడుతున్నారు. గత ప్రభుత్వం మాదిరే ఈ ప్రభుత్వం కూడా వారిపై కనికరం చూపటం లేదు. పంటల అమ్మకానికీ, ఎరువులు కొనుగోలుకూ నానా యాతన పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు వ్యవసాయ సీజన్లు ముగిసినా కౌలు రైతులకు మాత్రం రూపాయి సాయం అందలేదు.
జిల్లాలో 42వేల మందికి పైగానే..
జిల్లాలో 42 వేల మందికి పైగా కౌలు రైతులున్నారు. వీరిలో 90శాతం మంది చిన్న సన్నకారు రైతులే. తమకు ఉన్న ఎకరం, అరెకరం భూమితో పాటుగా మూడెకరాల నుంచి ఐదెకరాల వరకు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నారు. వీరికి ప్రభుత్వపరంగా ఎలాంటి చేయూత అందటం లేదు. కనీసం బ్యాంకుల్లో పంట రుణాలకు కూడా వీరు అర్హులు కాలేకపోతున్నారు. సాగు పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలతో పంటలకు నష్టం వాటిల్లినా ప్రభుత్వపరంగా అందించే సాయం పట్టాదారుల బ్యాంకు ఖాతాల్లోకే చేరుతుంది. వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవాలన్నా పట్టాదారుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలన్న పట్టాదారుల పేరుమీదనే కొనుగోలు చేయాల్సి వస్తుంది.
పెరిగిన కౌలు ధర
జిల్లాలో సుమారు 1.65 లక్షల ఎకరాల భూమిని కౌలు రైతులు సాగు చేస్తున్నట్లు అంచనా. గత రెండేళ్లుగా భూముల యజమానులు కౌలు ధరను అమాంతం పెంచారు. మాగాణి భూముల కౌలు ఎకరం రూ.18వేల నుంచి రూ.20వేల వరకు, పత్తి సాగు చేసే మెట్ట భూములకు రూ.20 వేల నుంచి రూ. 25 వేల వరకు పెరిగింది. మిర్చి, పొగాకు, కూరగాయల పంటల సాగు చేసే భూములు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ. 35 వేల వరకు పెంచారు. కౌలు ధరలతో పాటు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ట్రాక్టర్ దుక్కులు, కూలీల వేతనాలు కూడా ప్రతి ఏటా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులకు గిట్టుబాటు ధరలు దక్కక అప్పుల పాలవుతున్నారు. అప్పుల బాధతో ఇటీవల కాలంలో కౌలు రైతుల ఆత్మహత్యలకు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి ఎన్నికల హామీ మేరకు రైతుభరోసా అందించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.