
ఆరు నెలలైనా.. ఆచూకీ లేదు!
ఆగిన ఆర్గానిక్ ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్
● జిల్లాకు మంజూరైన జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ● గత నవంబర్లో ప్రకటించిన మంత్రి తుమ్మల ● ఎక్స్లెన్స్ సెంటర్ వస్తే సేంద్రియ సాగుకు మంచి రోజులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రతిష్టాత్మక సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్ జిల్లాకు మంజూరైనట్టు ప్రకటన వచ్చి ఆరు నెలలు దాటింది. కానీ ఇప్పటి వరకు ఈ అంశంపై ఎలాంటి పురోగతి లేదు. దీంతో ఎక్స్లెన్స్ సెంటర్ను జిల్లాకు తీసుకొచ్చే వరకూ ప్రజాప్రతినిధులు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.
దేశంలో ఐదు ఇన్స్టిట్యూట్లు..
ప్రస్తుతం నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్కు సంబంధించి దేశ వ్యాప్తంగా జోన్ల వారీగా ఐదు ఇన్స్టిట్యూట్లు పని చేస్తున్నాయి. ఇందులో సౌత్ జోన్కు సంబంధించిన సంస్థ బెంగళూరులో ఉంది. దీనికి అనుబంధంగా పని చేసే సెంటర్ను తెలంగాణకు మంజూరు చేశారు. ఈ కేంద్రాన్ని కొత్తగూడెంలో నెలకొల్పాలని మంత్రి తుమ్మల నిర్ణయించారు. ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆయిల్ ఫామ్ తరహాలో పూర్తి స్థాయి సంస్థగా ఈ కేంద్రం అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఆరు నెలలు గడిచినా ఈ అంశంపై మరో ప్రకటన రాకపోవడంతో జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అందుబాటులోకి వస్తే..
వ్యవసాయ రంగంలో పని చేస్తున్న యూనివర్సిటీలు, పరిశోధనా కేంద్రాలు, సేంద్రియ వ్యవసాయంలో పని చేస్తున్న ఎన్జీఓలు, ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమలు, ప్రజాప్రతినిధులంతా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్లో భాగస్వాములుగా ఉంటారు. వీరు స్థానిక రైతులకు, వ్యవసాయ సంఘాలకు సేంద్రియ సాగులో మెళకువలపై శిక్షణ ఇస్తారు. ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా ఇతర జిల్లాలకు ఆయా సేవలు, నైపుణ్యాన్ని విస్తరిస్తారు. తెలంగాణకు మంజూరైన సేంద్రియ వ్యవసాయ పరిశోధన సంస్థలో పని చేసేందుకు దేశ వ్యాప్తంగా పేరెన్నిక గల శాస్త్రవేత్తలు వస్తుంటారు. వీరి రాకపోకలకు సులువుగా ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే కొత్తగూడెం మీదుగా రెండు జాతీయ రహదారులు వెళ్తుండగా, రైలు కనెక్టివిటీ కూడా ఉంది. రాబోయే నాలుగేళ్లలో కొత్తగూడెంలో విమానాశ్రయ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దీంతో ఈ సంస్థను కొత్తగూడెంలో ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఆర్గానిక్కు డిమాండ్
వ్యవసాయ రంగంలో ఇప్పటికే పురుగుల మందులు, ఎరువుల వినియోగం గరిష్ట స్థాయికి చేరుకున్నాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో రసాయనాలు వాడకుండా సహజ సిద్ధమైన పద్ధతిలో సేంద్రియ ఎరువులు, మందులు వాడుతూ పండించే పంటలకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. అయితే సేంద్రియ సాగును లాభసాటిగా మార్చే పద్ధతులు, నైపుణ్యంపై రైతులకు సరైన అవగాహన, శిక్షణ లేదు. దీంతో కొందరు ఔత్సాహికులు, కొన్ని కార్పొరేట్ కంపెనీలు సేంద్రియ సాగుపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో ఎక్స్లెన్స్ సెంటర్ అందుబాటులోకి వచ్చి సేంద్రియ సాగుపై ఉన్న అపోహలు, భయాలు తొలగితే ఇతర ప్రాంతాల రైతులకు జిల్లా అన్నదాతలు మార్గదర్శిగా నిలిచే అవకాశం ఉంటుంది.