
చల్లారని మంటలు!
● రామయ్య భూముల వ్యవహారంలో తరచూ ఘర్షణ ● తాజాగా గ్రామస్తులు, ఆలయ సిబ్బంది నడుమ వాగ్వాదం ● భూముల అప్పగింతలో ఏపీ ప్రభుత్వ వైఫల్యం ● అవి తమవేనంటున్న రైతులు
భద్రాచలం: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భూముల వివాదం ఆగేలా లేదు. ఆలయ భూములున్న ఏపీలోని పురుషోత్తపట్నం గ్రామస్తులు, రైతులకు – దేవస్థానం సిబ్బందికి నడుమ జరుగుతున్న వాగ్వాదాలు, గొడవలు ఆరని మంటల్లా సాగుతూనే ఉన్నాయి. కోర్టు ఉత్తర్వుల ప్రకారం భూములు అప్పగించడంలో ఏపీ ప్రభుత్వం, అధికారుల వైఫల్యం ఉందని దేవస్థానం వర్గాలు అంటుండగా, ఆ భూములు తమవేనని పురుషోత్తపట్నం గ్రామస్తులు వాదిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం నిరంతర రణరంగంలా మారుతోంది.
ఏపీ ప్రభుత్వ వైఫల్యమే..
రామయ్య భూములను ఆలయానికి అప్పగించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని దేవస్థానం వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ భూములకు సంబంధించి గతంలో ఏపీ హైకోర్టుకు ఆధారాలతో వెళ్లగా, న్యాయస్థానం స్పష్టమైన తీర్పు ఇచ్చిందని చెబుతున్నాయి. 12 శాఖలకు చెందిన అధికారులు దేవస్థానానికి భూములను అప్పగించాల్సి ఉండగా, ఏళ్లు గడుస్తున్నా వారు పట్టించుకోవడం లేదని ఆలయ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బుధవారం ఆలయ భూముల్లో రేకుల షెడ్ నిర్మిస్తుండగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మళ్లీ వాగ్వాదం చోటుచేసుకుంది.
ఏపీ సీఎంను కలిసేందుకు ప్రణాళికలు..
ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలయ్యేలా, ఆలయానికి భూములను అప్పగించేడాల చూడాలని ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు దేవాదాయ శాఖ మంత్రిని, ఉన్నతాధికారులను కలిసేందుకు దేవస్థానం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భూములను అప్పగించడంలో రెవెన్యూ, పోలీస్ శాఖలు సహకరించడం లేదని, దీంతోనే వాగ్వాదాలు, గొడవలు జరుగుతున్నాయని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితే గాని రామయ్య భూములు స్వాధీనం కావని వివరించే అవకాశం ఉంది.
ముందుకు సాగని అభివృద్ధి
పురుషోత్తపట్నంలోని భూములు, వాటిపై వచ్చే ఆదాయం ఆలయానికి అందకపోవడంతో అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోతున్నాయి. అయితే ఆ భూములు తమవేనని పురుషోత్తపట్నం గ్రామస్తులు వాదిస్తున్నారు. 917 ఎకరాల భూమిని సోమరాజు పురషోత్తమదాసు అనే భక్తుడు 1878లో రామాలయానికి దానం చేశాడని, ఆ భూమిని నైజాం కాలంలో వరంగల్ తాలూకాలో వేలం వేయగా మహ్మద్ హుస్సేన్ సాహెబ్ అనే వ్యక్తి కొనుగోలు చేశాడని వారు చెబుతున్నారు. అనంతర కాలంలో ఆ భూములు క్రయ విక్రయాలు జరుగుతూ తమవద్దకు వచ్చాయని అంటున్నారు. దీనిపై తాము తెలంగాణ హైకోర్టును ఆశ్రయించామని, స్టేటస్ కో ఉందని వాదిస్తున్నారు.
ఆక్రమణలో 750 ఎకరాలు..
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,350 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో అత్యధిక భాగం 889 ఎకరాల భూమి ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పురుషోత్తపట్నం గ్రామంలో ఉంది. ఇందులో దాదాపు 750 ఎకరాల భూమి ఆక్రమణకు గురయి ఉంటుందని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. మిగిలిన భూమి అయినా కాపాడుకునేందుకు దేవస్థానం అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ భూముల్లోనే సుమారు 104 ఎకరాల్లో గోశాలతో పాటు చెరువు, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అయితే ఈ భూములను ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతులు.. తరతరాలుగా తమవేనని వాదిస్తున్నారు. జామాయిల్ సాగుతో పాటు శాశ్వత నిర్మాణాలు, ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ఇలా నిర్మాణాలు చేపట్టినప్పుడల్లా ఆలయ అధికారులు, సిబ్బంది అడ్డుకోవడం, వాగ్వాదం జరగడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో తోపులాటలు, భౌతిక దాడులతో రామయ్య భూములు రణరంగంగా మారుతున్నాయి.