
మూడు రోజుల్లో విద్యార్థులంతా చేరాలి
పాల్వంచరూరల్ : గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని అశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, పోస్ట్మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్ల విద్యార్థులంతా సోమవారం లోగా చేరుకునేలా వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులు చర్య తీసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. హాజరు కాని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించాలని అన్నారు. పాల్వంచ గిరిజన బాలికల అశ్రమ పాఠశాల, కొత్తగూడెంలోని పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్లను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హాస్టల్ గదులు, డార్మెటరీ, డైనింగ్ హాళ్లు, బాతురూమ్లు, వంటగదులు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సుమారు రెండు నెలల పాటు ఇంటివద్ద గడిపిన విద్యార్థులు హాస్టల్కు చేరుకోగానే వాతావరణ మార్పులతో అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని, పిల్లలందరికీ వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. వారం రోజుల పాటు పిల్లల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించాలని ఏఎన్ఎంలకు సూచించారు. సురక్షిత తాగునీరు సరఫరా అయ్యేలా చూడాలని, నూతన మెనూ ప్రకారం ఆహారం అందించాలని చెప్పారు. వసతిగృహాలు పురాతనంగా ఉన్నాయని, ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత వార్డెన్లపైనే ఉంటుందన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. ఏమైనా సమస్యలుంటే వార్డెన్కు తెలియజేయాలని, చదువు పట్ల నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. భవిష్యత్ లక్ష్యాల సాధనకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ మణెమ్మ, హాస్టల్ వార్డెన్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
హాస్టల్ వార్డెన్లు, హెచ్ఎంలు ఈ మేరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
వసతిగృహాలకు వచ్చే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి
హాస్టళ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపండి
ఐటీడీఏ పీఓ రాహుల్ ఆదేశం