కొత్తగూడెంఅర్బన్: చిన్నారులతో పని చేయించడం చట్టరీత్యా నేరమని, బడి ఈడు పిల్లలను తప్పనిసరిగా చదివించాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి అన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన క్యాంపెయిన్లో భాగంగా బుధవారం ఆమె కొత్తగూడెం చిన్న బజార్, పెద్ద బజార్లలోని కిరాణం దుకాణాలు, షాపింగ్ మాల్స్, ఇతర వ్యాపార సంస్థలను తనిఖీ చేశారు. చిన్న బజారులోని ఓ కిరాణా షాపులో బాల కార్మికుడిని గుర్తించి అతడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడి తల్లిని పిలిపించి తప్పనిసరిగా బడిలో చేర్పించాలని సూచించారు. 14 ఏళ్ల లోపు పిల్ల లను పనిలో పెట్టుకుంటే బాల కార్మిక చట్టం ప్రకారం యజమానిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. బాలుడిని బడిలో చేర్పించే బాధ్యతను తల్లితో పాటు షాపు యజమాని కూడా తీసుకోవాలన్నారు. స్కూల్లో అడ్మిషన్ చేయించిన తర్వాత వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో సహాయ కార్మిక శాఖ అధికారి మహమ్మద్ షర్ఫుద్దీన్, న్యాయవాది మెండు రాజమల్లు పాల్గొన్నారు.


