పర్చూరు(చినగంజాం): వ్యవసాయ రంగానికి సంబంధించి పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా పంటల మద్దతు ధరలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పీ కొండయ్య డిమాండ్ చేశారు. వ్యవసాయ పంటల మద్దతు ధర నిర్ణయించడంలో కేంద్ర ప్రభుత్వ మోసపూరిత వైఖరిని ఖండిస్తూ పర్చూరు బొమ్మల సెంటర్, నాగులపాలెం అంబేడ్కర్ నగర్, ఉప్పుటూరు చెరువు వద్ద ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ పంటల మద్దతు ధర జీవో కాపీలన దహనం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర రూ.2400 ఉండగా కేవలం రూ 10 లు పెంచి రూ 2410, వరికి క్వింటాకు రూ.2441గా నిర్ణయించడం యావత్ భారత దేశ రైతులకు అన్యాయం చేయడమేనని అన్నారు. 13 రకాల పంటలకు అతి తక్కువ ధర నిర్ణయించడం అన్యామని వారన్నారు. ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగాయని, సాగు ఖర్చులు పెరిగాయని కానీ అందుకు తగినట్లుగా మద్దతు ధర పెంచలేదని అన్నారు. రైతులు పండించిన పంటలకు పెట్టుబడికి 50 శాతం కలిపి పంటల మద్దతు ధర నిర్ణయించాలన్న నిపుణుల సిఫార్సులను తుంగలో తొక్కి, డాక్టర్ స్వామినాధన్ సిఫార్సులను అమలు చేయకుండా, బడా పెట్టుబడి దారులు అదానీ, అంబానీలకు ఈ దేశ సంపదను దోచి పెట్టడానికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉందని అన్నారు. రైతాంగం పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా రసాయనికి ఎరువుల ధరలు 50 కిలోల బస్తాపై రూ.100 నుంచి రూ.350 పెంచడం దుర్మార్గమని వారన్నారు. వెంటనే డాక్టర్ స్వామినాథన్ చేసిన సిఫారసులను అమలు చేయాలని, రసాయనిక ఎరువుల ధరలను, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని, 13 రకాల పంటలకు మద్దతు ధర పెంచాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉప్పుటూరులో రహీం, నాగులపాలెంలో రాజేష్, పర్చూరు బొమ్మల సెంటర్లో ఎం డేవిడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీ భాస్కరరావు,కామినేని శ్రీనివాసరావు, డేవిడ్, ఏసుబాబు తదితరులతో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు.


