మాజీ ఎమ్మెల్యే ఆమంచి
బాపట్ల: చీరాల ప్రాంతంలో పర్యావరణ, అటవీ సంరక్షణ చట్టానికి విరుద్ధంగా రిసార్ట్స్, అక్రమ లేవుట్స్ను ఏర్పాటు చేయటంపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కోరారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ను సోమవారం కలెక్టరేట్లో కలిసి వినతిపత్రం అందించారు. చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలంలోని చల్లారెడ్డిపాలెం గ్రామం పంచాయతీ, కఠారివారిపాలెం పరిధిలో రిసార్ట్స్, నిబంధనలకు విరుద్ధంగా లేవుట్స్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఏవిధంగా అనుమతులు ఇచ్చారో అర్థంకావటంలేదని వివరించారు. సముద్రతీరం అనుకుని నిర్మాణం చేపడుతున్న మౌనంగా ఉండటంపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన రిసార్ట్స్ నిర్వహణను నిలుపుదల చేయటంతోపాటు అక్రమ లే అవుట్స్ను తొలగించాలని కోరారు. వేటపాలెం మాజీ ఎంపీపీ బండ్ల తిరుమలాదేవి, కొత్తపేట మాజీ సర్పంచి చుండూరు వాసు, సుధార్, బుజ్జిబాబు, బొనిగల పేతురుబాబు, మల్లెల బుల్లిబాబు, పృద్వి, రమేష్, ముంగర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
భూగర్భ జలాలను సంరక్షించుకోవాలి
భూగర్భ జలాలను సంరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. జలభద్రత, సాగునీటి సంఘాల బాధ్యతపై సోమవారం స్థానిక బాపట్ల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సాగు, తాగునీటి చెరువులన్నీ అభివృద్ధి చేసుకోవాలన్నారు. నాణ్యమైన, పరిశుభ్రమైన జలాలను ప్రజలకు సరఫరా చేయాలన్నారు. చెరువు కట్టలు, పంట కాల్వల కట్టలు బలోపేతం చేయాలన్నారు. జలాల సంరక్షణలో భాగంగా 100 రోజుల కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. విలువైన ప్రతి నీటి చుక్కను భద్రం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జిల్లాలో ఉన్న 133 చెరువులు, వాటి కట్టల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. మే నెల 15వ తేదీన సాగర్ నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన సాగునీటి కాల్వల మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. భూగర్భ జలాలను పెంచడానికి యుక్త ధార కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని, ప్రజలు సహకరించాలని డ్వామా పీడీ విజయలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో జల వనరుల శాఖ అధికారులు సత్యనారాయణ, ధనలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, నీటి సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


