‘సూర్యలంక’కు సందర్శకుల కళ
● తరలివచ్చిన భక్తులు, పర్యాటకులు
● పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు
● భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు
బాపట్ల టౌన్: పర్యాటకులతో సూర్యలంక సముద్ర తీరం ఆదివారం కళకళలాడింది. కార్తిక మాసం ప్రారంభం నుంచి పౌర్ణమి వరకు బీచ్ మూసివేసి ఉండటం, పౌర్ణమి తర్వాత వచ్చిన మొదటి ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు, భక్తులు తీరానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో చేరుకున్నారు. దీంతో బాపట్ల–సూర్యలంక రహదారి రద్దీగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరంలో సందడి నెలకొంది. సూర్యోదయంతో కూడిన పుణ్యస్నానాలాచరించేందుకు భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచే వచ్చారు. యువత సరదాగా గడిపారు. కొందరు తీరం వెంబడి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇసుకతో గౌరీదేవి ప్రతిమ, శివలింగాలను తయారుచేసి వాటి ముందు ముగ్గులేసి గొబ్బెమ్మలను ఏర్పాటు చేశారు. స్వామి వారి శివలింగాన్ని పూలు, పసుపు, కుంకుమలతో ప్రత్యేకంగా అలంకరించారు. పూజలనంతరం గౌరీదేవి ప్రతిమలతోపాటు గంగమ్మకు ఇష్టమైన పూలు, పండ్లను సముద్రంలో కలిపి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
పోలీసుల సూచనలు పాటించాలి
తీరం మొత్తం నిఘా నేత్రంలో ఉందని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. ఆదివారం తీరాన్ని ఆయన సందర్శించారు. తీరం వెంబడి 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, తుపాను కారణంగా గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. డీఎస్పీలు జి.రామాంజనేయులు, ఎం.డి.మొయిన్, ఎస్బీ సీఐ జి.నారాయణ, సీఐలు ఎం.శ్రీనివాసులు, పి.శేషగిరి తదితరులు పాల్గొన్నారు.
‘సూర్యలంక’కు సందర్శకుల కళ


