
చేనేతను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా
చీరాలలో కార్మికుల ర్యాలీ
చీరాల: అధికారికంగా జులై 31ను చేనేత దినోత్సవంగా ప్రకటించాలని జాతీయ చేనేత నాయకులు, చేనేత ఉద్యమకారులు మాచర్ల మోహనరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాష్ట్ర చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో మండలంలోని జాండ్రపేటలోని శ్రీచౌడేశ్వరి దేవాంగ కల్యాణ మండపంలో గురువారం చేనేత సభను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తీవ్ర మార్కెట్ సంక్షోభం ఎదుర్కొంటున్న చేనేత పరిశ్రమపై ప్రస్తుతం ఉన్న ఐదు శాతం జీఎస్టీని వచ్చే సెప్టెంబర్ నుంచి 12 శాతానికి పెంచుతున్నట్లు కౌన్సిల్ ప్రకటించడం దారుణం అన్నారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దేవన వీరనాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కనీసం రూ.వెయ్యి కోట్లు నిధులు కేటాయించడంతోపాటు చేనేత కార్మికులకు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర మాట్లాడుతూ చేనేత పరిశ్రమపై ఉన్న జీఎస్టీ రద్దు చేయకపోవడం వలన మూలాధారమైన నూలు ధరలు అసాధారణంగా పెరగడంతో చేనేత ఉత్పత్తి మందగించి కార్మికుల పనిదినాలు తగ్గిపోవడంతో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అన్నారు. అనంతరం దేశాయిపేట నుంచి జాండ్రపేట వరకు రాష్ట్ర చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో చేనేత పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. చీరాలలో చేనేత పార్కు ఏర్పాటు చేయాలని, చేనేత వృత్తి భద్రత కల్పించాలని, చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని కార్మికులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో చేనేత నాయకులు దామర్ల శ్రీకృష్ణ, సీపీఐ నాయకులు బత్తుల శామ్యూల్, బిసి ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ చుండూరు వాసు, చీరాల నియోజకవర్గ అభివృద్ధి సాధన సమితి నాయకులు శీలం రవికుమార్, దేవన హేమసుందరరావు, గుంటూరు మల్లికార్జున్, సజ్జా శ్రీనివాసరావు, వావిలాల దాశరఽథి, మునగాల వెంకటేశ్వర్లు, ఓరుగంటి రెడ్డి రిజర్వేషన్ సమితి నాయకులు మేడిబోయిన వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.