
బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు వేగం పెంచాలి
బాపట్ల: బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అధికారులను ఆదేశించారు. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలుపై అధికారులు, బయ్యర్లతో జిల్లాస్థాయి కమిటీ సమావేశం సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 13 పొగాకు కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయన్నారు. గడిచిన వారంలో 1,765 టన్నులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజూ 325 మంది రైతుల నుంచి 650 టన్నులకు తగ్గకుండా పొగాకు కొనుగోలు చేయాలని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని పొగాకు కంపెనీలు విస్తృతంగా కొనుగోలు ప్రక్రియలో పాల్గొనాలన్నారు. కంపెనీల నిర్ణయాలు, లక్ష్యాలు అధికంగా ఉండేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ప్రస్తుతం 24 కంపెనీలు పొగాకును కొనుగోలు చేస్తున్నాయని తెలిపారు. అన్ని కంపెనీలు కలిపి మొత్తం 32 వేల మెట్రిక్ టన్నుల పొగాకును రైతుల నుంచి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసినట్లు వివరించారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన పొగాకు 4.40 లక్షల మెట్రిక్ టన్నుల వరకు నిల్వ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. మరో 2.0 లక్షల మెట్రిక్ టన్నుల పొగాకు నిల్వ చేయడానికి పొరుగు జిల్లాల్లో గోదాములను పరిశీలిస్తున్నామన్నారు. పొగాకు కొనుగోలు ప్రక్రియకు రెండు నెలలు గడువు ఇవ్వాలని కంపెనీల ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆగస్టు 31వ తేదీ వరకు 2,500 మంది రైతుల నుంచి కొనుగోలు చేయడానికి షెడ్యూల్ ఇచ్చామన్నారు. బాపట్ల జిల్లాలో 13,777 మంది రైతుల పేర్లు యాప్లో నిక్షిప్తం చేశామన్నారు. ముందుగా చిన్న, సన్న కారు రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేస్తున్నామన్నారు. నాలుగు రోజుల్లో ఆయా కొనుగోలు కేంద్రాలలో కంపెనీలు కొనుగోలు వివరాలపై నివేదిక ఇవ్వాలన్నారు. పొగాకు కొనుగోలు లక్ష్యాలు మరింత పెంచేలా నిర్ణయాలు ప్రకటించాలన్నారు. పొగాకు కొనుగోలు చేసే సమయంలో అధికారులు తేమ శాతాన్ని 20 కంటే మించకుండా పరిశీలించాలన్నారు. బ్లాక్ బర్లీ పొగాకు పంటను సాగు చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి సంయుక్త కలెక్టర్, డీఆర్వో జి గంగాధర్గౌడ్, మార్క్ఫెడ్ డీఎం కరుణశ్రీ, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ లవన్న, పొగాకు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
ఇసుక సరఫరాలో
ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్స్ పంపిణీ
టీబీ వ్యాధిగ్రస్తులు సంపూర్ణ ఆహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి సూచించారు. టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్స్ను సోమవారం అందించారు. జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ జిల్లాలో 1056 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు రెండు నెలలకు సరిపడే 11 రకాల పౌష్టికాహార కిట్స్ను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ షేక్ మొహమ్మద్ సాదిక్, జాతీయ క్షయ నిర్మూలన సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో ఇసుక సరఫరాకు ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంలో భాగంగా ఐవీఆర్ఎస్లో ప్రజాభిప్రాయ సేకరణపై వచ్చిన ప్రతికూలతపై జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఇసుకను ఇంటికి వద్దకు చేర్చడంలో టన్నుకు ఎంత వసూలు చేస్తున్నారో సంబంధిత వివరాలను ఇసుక కొనుగోలు చేసిన వ్యక్తులతో జిల్లా కలెక్టర్ నేరుగా ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు వారు జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లాలో గాజుల్లంక బీచ్ నుంచి మాత్రమే ఇసుకను సరఫరా చేస్తున్నామని, ప్రస్తుతం అక్కడ లారీలు వెళ్లేందుకు ఇబ్బందికర పరిస్థితులు ఉండటం వలన ఇతర ప్రాంతాల నుంచి ఇసుక సరఫరా చేస్తున్నందున ధరలో మార్పు వచ్చిందని కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్కు వివరించారు. గాజుల్లంక బీచ్ నుంచి ఇసుక సరఫరాకు సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గాజుల్లంక బీచ్లో 20 వేల టన్నులు మాత్రమే ఇసుక నిల్వ ఉందని, ఈ నిల్వలు రెండు నెలలకు మాత్రమే సరిపోతాయని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఇసుక కొరతను అధిగమించేందుకు ఇతర జిల్లాల నుంచి ఇసుకను బాపట్లకు తరలించి నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలని గనుల శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ గంగాధర్గౌడ్, గనుల శాఖ ఏడీ డి.రామచంద్ర, రవాణా శాఖ అధికారి పరంథామరెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.