
అన్ని వర్గాలకు అందుబాటులో దూరవిద్య
గుంటూరు ఎడ్యుకేషన్: సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే వైవిధ్యమైన దూరవిద్య కోర్సులను ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) అందిస్తోందని ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పి.శరత్చంద్ర అన్నారు. శుక్రవారం ఎన్జీవో కాలనీలోని మహాత్మాగాంధీ కళాశాలలో ఇగ్నో కోర్సులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శరత్చంద్ర మాట్లాడుతూ దేశంలో అత్యధిక మంది విద్యార్థులు, అనేక కోర్సులతో విద్యను అభ్యసిస్తున్న ఉన్నతమైన విశ్వ విద్యాలయంగా ఇగ్నో గుర్తింపు పొందినట్లు చెప్పారు. విజయవాడ ప్రాంతీయ కేంద్రంగా మన రాష్ట్రంలోని 15 జిల్లాలకు ఇగ్నో సేవలు అందిస్తోందని, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. సివిల్స్ స్థాయికి తగిన పాఠ్య ప్రణాళికతో కూడిన అంశాలు ఇగ్నో ప్రత్యేకతలు అని, ఒకే విద్యా సంవత్సరంలో ఒక రెగ్యులర్ కోర్సుతో పాటు దూరవిద్యా విధానంలో ఆన్లైన్లో మరొక కోర్సు అభ్యసించే వీలుందని తెలిపారు. కార్యక్రమంలో గౌతమి విద్యాసంస్థల చైర్మన్ కనుమర్ల గుండారెడ్డి, ప్రిన్సిపాల్ పి. ఉదయ్కిరణ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పొగాకు కొనుగోలులో అవకతవకలు నివారించాలి
ప్రభుత్వానికి రైతు సంఘాల నేతలు డిమాండ్
లక్ష్మీపురం: రాష్ట్రంలో పొగాకు కొనుగోలులో అవకతవకలు నివారించాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్ రెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలను పెంచాలని, నాణ్యత పేరుతో తెచ్చిన పొగాకును బయ్యర్లు వెనక్కి పంపకుండా చూడాలన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం పొగాకు రైతుల సంఘం నాయకుల సమావేశం డాక్టర్ కొల్లా రాజమోహన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంపెనీలు పొగాకు కొనకపోవడంతో ఆందోళన చేపట్టడం వలన మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. కానీ గుంటూరు జిల్లాలో 50 కిలోమీటర్ల దూరం వెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. సగం కూడా కొనుగోలు చేయకుండా బయ్యర్లు తిప్పి పంపుతున్నట్లు, ప్రైవేటు వారికి ఉపయోగపడేలా ఇలా చేస్తున్నట్లు ఆరోపించారు. దీంతో అయినకాడికి విక్రయించి రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు చెప్పారు. ఇప్పటికే 8 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ఆందోళనలు, వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఎం.హరిబాబు, కొల్లా రాజమోహన్, కంచుమాటి అజయ్, టి.రామారావు, జె.జయంతి బాబు, పి.శివాజి, పి.రామారావు, కె.గణేశ్ బాబు, పి.వి. జగన్నాథం, కె.విఠల్ రెడ్డి, బిక్కి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అన్ని వర్గాలకు అందుబాటులో దూరవిద్య