
కూటమి ప్రభుత్వంలో చేనేత వ్యవస్థ నిర్వీర్యం
దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర
చీరాల: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత వ్యవస్థ నిర్వీర్యమైందని దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. చేనేత సహకార సంఘాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రభుత్వం వెంటనే ఎన్నికలు, పాలక మండలి నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నేతన్న నేస్తం ద్వారా మగ్గం ఉన్న వారికి ఏడాదికి రూ.24 వేలు ఇచ్చి ఆదుకున్నారని గుర్తు చేశారు. ఈ పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. 200 యూనిట్లు విద్యుత్ జీఓకే పరిమితం అయిందని, వెంటనే అమలు పరచాలని ఆయన కోరారు. ఆప్కోకు చైర్మన్ను నామినేట్ చేసి ఇప్పటి వరకు జీఓ ఇవ్వకపోవడం దారుణమని తెలిపారు.
చేనేత వర్గం మద్దతుతో గెలిచిన నారా లోకేష్ దీనిపై స్పందించాలని కోరారు. ఎన్నికల్లో జీఎస్టీ గురించి హామీ ఇచ్చిన ఆయన ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని తెలిపారు. చేనేతలు అభివృద్ధితో పాటు ఆకలి చావులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అభివృద్ధి పేరిట కొంగ జపం చేస్తున్న కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం పట్టించుకోకపోవడంతో ప్రజల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో చేనేతలకు అందిన లబ్ధి శూన్యమని పేర్కొన్నారు.