మదనపల్లె టౌన్: మదనపల్లి మండలంలోని నారమాకుల తండాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో గాయపడ్డ ఇరువర్గాలు మంగళవారం స్థానిక జిల్లా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ కథనం ప్రకారం నారమాకుల తండాకు చెందిన అప్పానాయక్, తావరే నాయక్ల మధ్య ఆర్థిక వ్యవహారాల విషయంలో వివాదం తలెత్తింది. మాట మాట పెరిగి ఇరువురు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన వారు గాయపడ్డారు. కుటుంబీకులు వెంటనే వారిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.


