హాస్టళ్ల మూసివేతకు రంగం సిద్ధం
మదనపల్లె సిటీ : పేద, సామాన్య కుటుంబాల పిల్లల చదువుల కోసం వెలిసిన సంక్షేమ వసతి గృహాలు ఇప్పుడు మూతబాట పట్టాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై ఒకటిన్నర నెల గడుస్తున్నా కనీస వసతులు కల్పించకపోగా, జిల్లాలో ఏకంగా 14 బీసీ సంక్షేమ వసతి గృహాలను మూసివేసేందుకు హడావుడిగా రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే హాస్టళ్లలో చేరిన నిరుపేద విద్యార్థులు ఇప్పుడు తమ భవిష్యత్తు ఏంటో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు.
విద్యార్థులు లేరనే సాకు..
జిల్లాలో బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఆశించిన సంఖ్యలో విద్యార్థులు లేరనే సాకు చూపిస్తూ అధికారు లు ఏకంగా 14 హాస్టళ్లను శాశ్వతంగా మూసివేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. నిరుపేద విద్యార్థుల చదువులకు ఆసరాగా నిలవాల్సిన ఈ వసతి గృహాలకు తాళాలు వేయాలని చూడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.వాస్తవానికి తంబళ్లపల్లెలోని బీసీ సంక్షేమ బాలుర వసతి గృహాన్ని గత ఏడాది నుంచే మూసి ఉంచారు. అలాగే నిమ్మనపల్లెలోని వసతి గృహాన్ని గతంలోనే మదనపల్లెకు మార్చేశారు. ఈ క్రమంలో మిగిలిన హాస్టళ్లలోని విద్యార్థులను సమీపంలోని ఇతర హాస్టళ్లలో గానీ లేదా రాయచోటిలోని మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల హాస్టల్లో గానీ చేర్పించాల్సిందిగా అధికారుల నుంచి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. స్థానికంగా ఉంటూ చదువుకునే పేద పిల్లలను కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయచోటి పంపమనడం అధికారుల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
సమీప హాస్టల్స్లో చేర్పిస్తాం!
అధికారులు సిద్ధం చేసిన నివేదిక ప్రకారం జిల్లాలో తాళాలు పడనున్న 14 బీసీ వసతి గృహాల వివరాలు ఇలా ఉన్నాయి
తంబళ్లపల్లె (బీసీ బాలుర వసతి గృహం)
ములకలచెరువు (బీసీ బాలికల వసతి గృహం)
బీ.కొత్తకోట (బీసీ బాలుర వసతి గృహం)
నిమ్మనపల్లె (బీసీ బాలుర వసతి గృహం)
మేడికుర్తి (బీసీ బాలుర వసతి గృహం)
రైల్వే కోడూరు (బీసీ బాలుర వసతి గృహం)
నందలూరు (బీసీ బాలుర వసతి గృహం)
తాళ్లపాక (బీసీ బాలుర వసతి గృహం)
లక్కిరెడ్డిపల్లె (బీసీ బాలికల వసతి గృహం)
వగళ్ల (బీసీ బాలుర వసతి గృహం)
వాల్మీకిపురం (బీసీ బాలికల వసతి గృహం)
రామసముద్రం (బీసీ బాలుర వసతి గృహం)
పీటీఎం (బీసీ బాలుర వసతి గృహం)
వీరబల్లి (బీసీ బాలుర వసతి గృహం)


