గుర్రంకొండ : అక్రమంగా తరలిస్తున్న 750 కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్ చేసిన సంఘటన గుర్రంకొండలో సోమవారం చోటు చేసుకుంది. గుర్రంకొండ పరిసరాల్లో ఎస్ఐ రవీంద్రబాబు ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దమండ్యం నుంచి కలకడకు రేషన్ బియ్యంతో వెళుతున్న ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. వెంటనే ఆటోను పోలీస్స్టేషన్ వద్దకు తీసుకెళ్లి 750 కేజీల బియ్యాన్ని సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న కలకడకు చెందిన అక్బర్బాషాపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ట్రాక్టర్ను ఢీకొన్న బస్సు
– మహిళ మృతి
సదుం : బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పీలేరు–కలికిరి రహదారిపై అంకాళమ్మ ఆలయ సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద ఆదివారం రాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ట్రాక్టరును వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో తన కుమారుడు మదన్మోహన్రెడ్డితో కలిసి ట్రాక్టర్లో వెళుతున్న పులిచర్ల మండలం చెరుకువారిపల్లెకి చెందిన యశోదమ్మ (65) గాయపడ్డారు ఆమెను పీలేరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. పోలీసులు బస్సును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్తి వివాదంపై ఎస్పీకి ఫిర్యాదు
మదనపలె టౌన్: తమ ఇంటిపైకి 20 మందితో కలిసి వచ్చి భౌతిక దాడులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా జేసీబీతో ఇల్లు కూల్చివేసి బంగారం, నగదు దోచుకెళ్లారని, సోమవారం చిన్నతిప్పసముద్రం గ్రామానికి చెందిన చాంద్ బాషా ఎస్పీ ధీరజ్కు ఫిర్యాదు చేశారు. మండలంలోని చిన్నతిప్పసముద్రంలో తాత ముస్తాన్ సాహెబ్ నుంచి వారసత్వంగా ఇచ్చిన ఆస్తిపై జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసు పెండింగ్లో ఉందన్నారు. 2024 డిసెంబర్ 13న షేక్ వజీర్ బాషా మరికొందరితో కలిసి ఆయుధాలతో ఇంట్లోకి ప్రవేశించి తమ కుటుంబ సభ్యులపై దాడికి దిగారని ఆరోపించారు. వెంటనే 100కు కాల్ చేయగా, పోలీసులు వారందరినీ స్టేషన్న్కు పిలిచారన్నారు. తాము పోలీస్ స్టేషనన్లో ఉండగానే, ప్రత్యర్థులు జేసీబీతో వచ్చి ఇంటిని కూల్చివేసి, బంగారం, నగదు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి తమకు న్యాయం చేయమని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదన్నారు. తమపై దాడి చేసి, ఇల్లు కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆయన ఎస్పీని కోరారు.
భూ ఆక్రమణలు
అడ్డుకోవాలని వినతి
మదనపల్లె టౌన్ : కబ్జాదారుల నుంచి తమ భూమిని ఇప్పించాలని ఓ శ్రీ విద్య అనే యువతి సోమవారం ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. మదనపల్లె పట్టణం అమ్మినేని వీధికి చెందిన విశ్వనాథ్ 2004లో పొన్నెటిపాలెంలో జంగాల వెంకటస్వామి పేరున ఉన్న 11 సెంట్ల భూమిని కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకున్నట్లు బాధితురాలు తెలిపారు. తండ్రి విశ్వనాథ్, తమకు భూమి అమ్మిన వ్యక్తి చనిపోయిన అవకాశాన్ని వాడుకుని చంద్రిశేఖర్ అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి భూమిని కబ్జా చేసి ఇతరులకు విక్రయించారని ఆరోపించారు. తమ భూమిని కాపాడుకోవడానికి వెళితే తమనే భూమిని వదిలేసి వెళ్లాలని రఘుపతి నాయుడు మరికొందరు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం చేసి, కబ్జాదారుల నుంచి తమ భూమిని కాపాడాలని ఎస్పీని కోరారు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్పీ, సంబంధిత అధికారులతో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


