కడప అర్బన్ : కడప నగరం టూ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని బిస్మిల్లా నగర చెందిన ఓ యువతి (20) ఈ నెల 25వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కడప నగరంలోని ఓ మహిళా డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 25వ తేదీ ఉదయం 8 గంటలకు కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ తెలిసినవారు తమకు తెలియజేయాలని కడప టూ టౌన్ సీఐ శ్రీహరి తెలియజేశారు.
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె కొత్త ఇండ్లకు చెందిన రియల్టర్ షేక్ ఇస్మాయిల్(58) శ్రీకాకుళంలో ఆదివారం రైలు దిగే క్రమంలో కాలు జారి పడి మృతి చెందిన ఘటన విషాదం నింపింది. ఇస్మాయల్ మృతిపై కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మదనపల్లె కొత్త ఇండ్లకు చెందిన ఇస్మాయిల్ తన స్నేహితులతో కలిసి శుక్రవారం మదనపల్లె మండలంలోని సిటిఎం రెల్వే స్టేషన్ నుంచి 8 మందితో కలిసి శ్రీకాకుళంలోని హరివిల్లి శివాలయానికి వెళ్లారు. ఆదివారం స్వామివారిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణానికి శ్రీకాకుళం రైల్వే స్టేషన్కు అందరూ వచ్చారు. స్నేహితులతో కలిసి రైలు ఎక్కే సమయంలో పొరపాటున వేరే రైలు ఎక్కిన ఇస్మాయిల్, చైన్ లాగి రైలు నుంచి దిగే క్రమంలో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. సహచరులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించినా చికిత్స ఫలించక ఇస్మాయిల్ మృతి చెందాడని కుటుంబీకులకు సమాచారం అందించారు. ఇస్మాయిల్ మరణ వార్త తెలిసి కొత్త ఇండ్ల ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మదనపల్లె టౌన్ : తండ్రిపై తనయుడు కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన ఆదివారం రాత్రి గుర్రంకొండ మండలంలో చోటుచేసుకుంది. మదనపల్లె జిల్లా ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసుల కథనం మేరకు.. గుర్రంకొండ మండలం మర్రిపాడుకు చెందిన అబ్దుల్ గనితో కుమారుడు గొడవపడి ఆవేశంలో కత్తితో దాడి చేశాడని తెలిసింది. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితికి చేరుకున్న అబ్దుల్గనిని కుటుంబీకులు మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్స అనంతరం అతని పరిస్థితి విషమంగా ఉందని, తిరుపతి రుయాకు వెల్లాలని రెఫర్ చేశారు. ఘటనకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.


