మదనపల్లె టౌన్ : కుటుంబ కలహాలతో భవన నిర్మాణ కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గురువారం రాత్రి మదనపల్లె మండలం బసినికొండలో చోటుచేసుకుంది. తాలూకా పోలీసుల కథనం ప్రకారం.. బసినికొండకు చెందిన భవన కార్మికుడు కూలర్ పాపన్న (32) కుటుంబ సమస్యలతో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని బాధితుడిని కిందకు దించారు. వెంటనే ఆటోలో స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించగా, అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి అప్పటికే మార్గమధ్యంలో మృతి చెందినట్లు నిర్ధారించారు. అతడికి భార్య మహతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బంధువులు చనిపోవడంతో భార్య కోలార్కు వెళ్లి గురువారం రాత్రి తిరిగి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఇంతలోనే పాపన్న ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తాలూకా పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.


