మదనపల్లె టౌన్ : ఏపీ ఎయిడ్స్ నియంత్రణ మండలి నిర్వహిస్తున్న మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాలను ఏఆర్టీ సెంటర్లో డాక్యుమెంటేషన్ పక్కాగా నిర్వహించాలని ఏపీ శాక్స్ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్, ప్రిఫర్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ సూచించారు. గురువారం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఏఆర్టీ కేంద్రాన్ని వారు తనిఖీ చేశారు. ఎయిడ్స్ సురక్ష కార్యక్రమంలోని పలు అంశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సోచ్లో వివరాలు ఎలా పొందుపరచాలో తెలిపారు. ఏఆర్టీ ఇండికేటర్స్లో గ్యాపులు లేకుండా చూసుకోవాలన్నారు. టార్గెట్లను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కౌన్సెలింగ్, మందుల సరఫరా విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. హెచ్ఐవీ స్క్రీనింగ్ లక్ష్యాలను 95 శాతం వరకు చేరుకోవాలని, అలాగే హెచ్ఐవీ ఉన్న వారిలో 95 శాతం మందికి చికిత్స అందించాలన్నారు. కార్యక్రమంలో ఏపీ శాక్స్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభు సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్ నాగార్జున, ఉమ్మడి జిల్లాల క్లస్టర్ ఆఫీసర్ భాస్కర్ పాల్గొన్నారు.
ఏపీ శాక్స్ రిటైర్డ్ జేడీ డాక్టర్ రాజేంద్రప్రసాద్


