రొంపిచెర్ల: రొంపిచెర్ల క్రాస్ రోడ్డు సమీపంలోని గంగా డాబా ఎదురుగా ఏర్పాటు చేసిన మామిడి కాయల మండిలో మామిడి కాయలు కొనుగోలు ప్రారంభం అయింది. అన్నమ్మయ్య జిల్లా రాయచోటికి చెందిన మామిడి వ్యాపారులు ఇక్కడ మండి ఏర్పాటు చేశారు. నాణ్యతగా ఉన్న బేనీషా రకం మామిడి కాయలు టన్ను రూ.35 వేలు ధర పలికింది. దీంతో రైతులు సైజుకు వచ్చిన బేనీషా రకం మామిడి కాయలను మండికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రెండేళ్లుగా మామిడి పంటకు గిట్టుబాటు ధరలు లేక పొలాల్లోనే మామి డి కాయలను వదిలేయాల్సి వచ్చింది. గత సంవత్సరం టన్ను మామిడి కాయలు రూ.10 నుంచి 12 వేలు పలికింది. ఇప్పుడు బేనీషా రకం మామిడి కాయను బట్టి టన్ను రూ. 25 వేలు నుంచి 35 వేలు వరకు పలకడం విశేషం. ప్రస్తుతానికి ధర ఉందని మళ్లీ తగ్గి పోతుందేమోనని రైతులు వడివడిగా కోతలు కోస్తున్నారు. బెంగుళూరు రకం టన్ను రూ.10 వేలు నుంచి 20 వేలు వరకు పలుకుతోంది. మామిడి కాయలకు కవర్లు కట్టిన బేనీషాకు మాత్రం టన్నుకు రూ.60 వేలు నుంచి 70 వేల వరకు ఇస్తుండడం విశేషం. కవర్లు కట్టిన రైతులకు వ్యాపారులకు గిట్టుబాటు ధర వస్తుండడంతో రైతు లు, వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రొంపిచెర్ల క్రాస్ మండిలోమామిడి కొనుగోలు ప్రారంభం
కవర్లు కట్టిన మామిడికి డిమాండ్


