మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రామ్ అధికారి భాస్కర్ పేర్కొన్నారు. బుధవారం రాయచోటి ఏరియా ఆసుపత్రిలోని ఐసీటీసీ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. వివిధ విభాగాల నెలవారీ నివేదికలను పరిశీలించారు. నివేదికల్లో ఉన్న వ్యత్యాసాలను సరిదిద్దుకొని సేవలను మరింత మెరుగు పరచాలని సూచించారు. హెచ్ఐవీ పాజిటివ్గా ఉన్న వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, క్రమం తప్పకుండా మందులు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని ఏఆర్టీ కేంద్రాలు, ఐసీటీసీలు, ఎన్జీవోలు సమన్వయంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ఐసీటీసీ కేంద్రాల్లో పరీక్షా కిట్లు, ఏఆర్టీ మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రతి సంవత్సరం మే నెల మూడో ఆదివారం నిర్వహించే కాండిల్ లైట్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కౌన్సిలర్ ఉమాదేవి, ఎల్టీ శంకర్ పాల్గొన్నారు.


