మదనపల్లె: రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 30న రాయచోటిలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి దాసరి నాగార్జున మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భాస్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్్స్ లో నిర్వహించే మేళాకు ప్రముఖ కంపెనీలు పాల్గొని సుమారు 500 కు పైగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారని తెలిపారు. పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇతర అర్హతలు కలిగిన నిరుద్యోగులు హాజరుకావాలని కోరారు.
మదనపల్లె సిటీ: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షల ఫీజును ఈనెల 30 వరకు పొడగించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎస్.రవి తెలిపారు. మొదటి సంవత్సరం ఫెయిల్ అయిన విద్యార్థులు రూ.600, ద్వితీయ సంవత్సరం ఫెయిల్ అయిన విద్యార్థులు రూ.600, మొదటి, రెండవ సంవత్సరం రెండింటిలోనూ ఫెయిల్ అయిన విద్యార్థులురూ.1200 చెల్లించాలన్నారు. మొదటి, రెండవ సంవత్సరాలు ఇంప్రూమెంట్ రాసే విద్యార్థులు ఒక పేపర్కు రూ.160 చెల్లించాలని పేర్కొన్నారు. బోర్డు ఫీజు కంటే ఎక్కువ ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మదనపల్లె: జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని మంగళవారం కలెక్టర్ నిశాంత్కుమార్ అధ్యక్షతన కలెక్టరేట్లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి అందిన దరఖాస్తులకు సింగిల్ డెస్క్ విధానం కింద త్వరితగతిన అనుమతులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు అనుమతులు, రెన్యూవల్కు 687 దరఖాస్తులు అందగా 676 దరఖాస్తులను పరిష్కరించామని వెల్లడించారు. ఉత్పాదన రంగాల్లోని 11 యూనిట్ల్లకు రూ.1.45 కోట్ల రాయితీకి కమిటీ ద్వారా ఆమోదం తెలిపింది. పీఎంఈజీపీ ద్వారా 446 యూనిట్లకు రూ.9.16 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కృష్ణ కిశోర్, జోనల్ మేనేజర్ కే.శ్రీనివాసమూర్తి, అధికారులు పాల్గొన్నారు.
మదనపల్లె సిటీ: వేసవి క్రీడా శిబిరాలు మే 1వతేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు డీఎస్డీఓ జి.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం డీఎస్డీఓ కార్యాలయంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణ, కోచ్ల ఎంపికపై పీడీలతో సమావేశం నిర్వహించారు.వేసవి క్రీడా శిబిరాలకు కోచ్ల ఎంపిక పూర్తి చేశామన్నారు. శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ శిబిరాలు మే 31వతేదీ వరకు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా క్రీడా చైతన్యం పెంపొందించి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించాలన్నారు. జిల్లాలోని అన్ని క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగరాజ, క్రీడాభారతి కార్యదర్శి నరేష్, పీడీలు పాల్గొన్నారు.
వాల్మీకిపురం: రాబోవు ఖరీఫ్ సీజన్లో రైతులందరూ రసాయన రహిత వ్యవసాయ సాగును అధికంగా చేపట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివన్నారాయణ తెలిపారు. మంగళవారం స్థానిక రైతు సేవా కేంద్రంలో వ్యవసాయశాఖ, ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి రసాయన రహిత వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దఫా ఎల్నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వెంకటమోహన్, ఏడీఏ నాగప్రసాద్, ఏవో మురళీ మోహన్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది స్వాతి, హరినాథ రెడ్డి, రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.


