వాల్మీకిపురం : వాల్మీకిక్షేత్రంలోని పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు మంగళవారం రాత్రి 8గంటలకు స్వామివారు అశ్వవాహనంపై పార్వేటకు బయల్దేరారు. ఉదయం సుప్రభాతసేవ, మూలవర్లకు అభిషేకం, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, తిరుచ్చిలో స్వామివారి అలంకరణ, 8 నుంచి 9 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం, స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. సాయంత్రం ఊంజల్ మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం వాహన మండపంలో స్వామివారిని విల్లంబులు ధరింపజేసి పార్వేటకు సిద్ధం చేశారు.
అశ్వవాహనంపై విల్లంబులతో భక్తులకు ప్రతాపరాముడిగా దర్శనమిచ్చారు. పార్వేట మండపంలో సలహాదారులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు రాములవారి పార్వేట ఉత్సవం గురించి కథారూపంలో భక్తులకు తెలియజేశారు. వేట అనంతరం స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి క్రిష్ణమూర్తి, నాగరాజ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


