మదనపల్లె: స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ జిల్లా కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించనున్నట్లు స్థానిక సబ్రిజిస్ట్రార్ గురుస్వామి నాయుడు తెలిపారు. స్థానికు కురవంకలోని మైసూర్ బ్యాంకు బ్రాంచీ కార్యాలయం వద్ద తమ జిల్లా కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో మంగళవారం ఒంటిమిట్టలో కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తో కలిసి కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఈ రిహార్సల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కాన్వాయ్ వెళ్లే మార్గంలో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
మదనపల్లె అర్బన్: స్పష్టమైన ప్రణాళిక..సమష్టి కృషితో జలధార ప్రాజెక్ట్ విజయవంతమైందని కలెక్టర్ నిషాంత్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో కమాండ్ ఏరియా డెవలెప్మెంట్ అథారిటీ స్పెషల్ కమిషనర్ ప్రశాంతి ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ అధ్యయనం చేయడానికి వచ్చిన అధికారులు, జేఎన్టీయూ ప్రొఫెసర్ల బృందంతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అన్నిశాఖల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు అమలు చేసి మంచి ఫలితాలు సాధించామని వివరించారు. ముఖ్యంగా ఉపాధిహామీ పథకం ద్వారా లేబర్ బడ్జెట్ను నీటి సంరక్షణ పనులకు వినియోగించడంతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. కమిషనర్ ప్రశాంతి మాట్లాడారు. అనంతరం జలధార ప్రాజెక్ట్, నీటి సంరక్షణ చర్యలపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను పరిశీలించారు.


